Begin typing your search above and press return to search.

మీ పిల్లలకు టికెట్లు రాకపోవడానికి కారణం నేనే.. మోడీ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   15 March 2022 6:00 PM IST
మీ పిల్లలకు టికెట్లు రాకపోవడానికి కారణం నేనే.. మోడీ సంచలన కామెంట్స్
X
వారసత్వ రాజకీయాలకు ప్రధాని మోడీ చెక్ పెట్టారు. చెక్ పెట్టడమే కాదు.. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ అమలు చేసి చూపించారు. వారసత్వ రాజకీయాలు ప్రజా స్వామ్యానికి ప్రమాదకరమని.. అలాంటి వాటికి భారతీయ జనతా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదని ప్రధాని మోడీ అన్నారు. అంతేగాక ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం తానేనని మోడీ ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం.

ఢిల్లీలోని అంబేద్కర్ కేంద్రంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఇటీవల ఐదురాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ప్రధాని మోడీ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ పాలనను ఏకిపారేశారు.

దేశాన్ని నిర్వీర్యం చేసేవి కుటుంబ పార్టీలేనని మోడీ స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలతో ప్రజా స్వామ్యానికి ముప్పు అన్నారు. అలాంటి వాటికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందన్నారు. అలాంటప్పుడు పార్టీ కూడా అందుకు ఉదాహరణగా నిలవాలని సూచించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది పార్టీ పార్లమెంట్ సభ్యులు, నేతలు తమ పిల్లలకు టికెట్లు అడిగారని.. కానీ చాలా మంది అభ్యర్థులను పార్టీ తిరస్కరించిందని.. ఇందుకు పూర్తి బాధ్యత నాదేనని మోడీ సంచలన ప్రకటన చేశారు. నా వల్లే మీ పిల్లలకు టికెట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

వారసత్వ రాజకీయాలు కులతత్వానికి దారితీస్తాయని.. దీనిపై ఎంపీలందరూ పోరాడాలని సూచించారు. కుటుంబ పార్టీ నైజాన్ని బయటపెట్టాలని మోడీ హితబోధ చేశారు. ఈ సందర్బంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, ఎంపీలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

ఇక కశ్మీరీ పండింట్ల దారుణాలను కళ్లకు కట్టిన ఈ సినిమాను అందరూ చూడాలని.. ఈ సినిమాపై మోడీ ప్రశంసలు కురిపించారు.