Begin typing your search above and press return to search.

లక్ష్మీ పార్వతి ఘాటు తిట్లు.. లోకేశ్ కు మైలేజీని పెంచాయట

By:  Tupaki Desk   |   3 Sep 2021 5:37 AM GMT
లక్ష్మీ పార్వతి ఘాటు తిట్లు.. లోకేశ్ కు మైలేజీని పెంచాయట
X
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయ న్న నానుడి తరచూ వింటుంటాం. అందుకు తగ్గట్లే తాజాగా లక్ష్మీ పార్వతి తీరు ఉందంటున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రతి ఒక్క నేతకు ఒక ఇమేజ్.. ఒక స్థాయి ఉంటుంది. తనకు తగ్గట్లుగా మాట్లాడితే.. ఎంతటి తోపు లీడరైనా ఫేడ్ అవుట్ కావాల్సిందే. అందుకే.. రాజకీయాల్లో ఉన్న వారు ఒప్పులు చేయకున్నా ఫర్లేదు కానీ.. తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా టీడీపీ ముఖ్యనేత లోకేశ్ పై ఘాటు విమర్శలు చేశారు తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లోకేశ్ సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారని.. అలాంటి వారికి తాము బుద్ధి చెబుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదన్న భయాందోళనే లోకేశ్ చేత ఇలాంటి మాటలు వచ్చేలా చేస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తమ అధినేత జగన్ చిన్న సైగ చేస్తే.. లోకేశ్ ను ఏం చేసేందుకైనా తాము సిద్ధమన్నట్లుగా ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. లోకేశ్ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. ఏడో తరగతి కూడా పాస్ కాని వ్యక్తికి స్టాన్ ఫర్డ్ వర్సిటీలో సర్టిఫికేట్ వచ్చిందంటే ఎలా నమ్మాలి? అని ప్రశ్నించారు. అదెలా వచ్చిందో తమకు తెలసన్నారు. ఏదైనా కొంతకాలమే సహిస్తామని.. ఎక్కువైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు. లోకేశ్ నోటిని అదుపులో ఉంచుకోకపోతే.. ఆ తర్వాత జరిగే అనర్థాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్న లక్ష్మీ పార్వతి మాటలు సంచలనంగా మారాయి.

చంద్రబాబును లక్ష్మీ పార్వతి ఎంతటి మాటలు అన్నా పెద్దగా నెగిటివ్ కాదు. కానీ.. తన వయసు కంటే చాలా చిన్నవాడు.. ఆమె గురించి ఎప్పుడూ ఎలాంటి విపరీత వ్యాఖ్య చేయని లోకేశ్ మీద లక్ష్మీపార్వతి ఘాటుగా రియాక్టు కావటం ఆమెకే నష్టమంటున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే.. లోకేశ్ ను ఏం చేసేందుకైనా తాము సిద్ధమన్నట్లుగా చెప్పే మాటలతో మైలేజీ తర్వాత.. భారీ డ్యామేజ్ తప్పదంటున్నారు.

కొన్ని కాంబినేషన్లు అస్సలు సెట్ కావని.. అలాంటి కోవలోకే లోకేశ్ ను లక్ష్మీ పార్వతి టార్గెట్ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు. ఇదేమీ ఆలోచించకుండానే ఆమె అంత తప్పు చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. బాబును లక్ష్మీ పార్వతి ఎన్నేసి మాటలు అన్నా ఓకే కానీ.. లోకేశ్ ను ఇంతలా టార్గెట్ చేయటం ఆయనకే సానుభూతి కలిగేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.