Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాకిచ్చిన కుప్పం

By:  Tupaki Desk   |   17 Nov 2021 6:40 AM GMT
చంద్రబాబుకు షాకిచ్చిన కుప్పం
X
అందరు ముందునుండి ఊహిస్తున్నట్లుగానే కుప్పం ప్రజలు చంద్రబాబునాయుడుకు పెద్ద షాకిచ్చారు. 25 వార్డులకు హోరా హోరీగా జరిగిన ఎన్నికలో వైసీపీకి సంపూర్ణ విజయం దక్కింది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 25 వార్డుల్లో వైసీపీ 14 వార్డుల్లో గెలిచింది. మున్సిపాలిటిగా మారిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో వైసీపీ జెండా ఎగరేయటం గమనార్హం.

మున్సిపాలిటిలో టీడీపీని గెలిపించి ఎలాగైనా తన పట్టుని నిలుపుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నించారు. ఇందులో భాగంగానే పార్టీలోని సీనియర్ నేతలను కుప్పంలో మోహరించారు. మూడు రోజులు కుప్పం టౌనులోనే చంద్రబాబు మకాం వేసి వార్డు వార్డు తిరిగి ప్రచారం చేశారు. టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని ఒంగిఒంగి మరీ దణ్ణాలు కూడా పెట్టారు. ఇది సరిపోదన్నట్లుగా నారా లోకేష్ కూడా మూడు రోజులు కుప్పం వార్డుల్లో ప్రచారం చేశారు. అన్నీవార్డుల్లో రోడ్డుషోలు నిర్వహించారు. వైసీపీని ఓడించటం ద్వారా కుప్పం ప్రజల ఆత్మగౌరవాన్ని చాటాలని పిలుపిచ్చారు. డబ్బుకు కుప్పం ప్రజలు అమ్ముడుపోయేరకం కాదని నిరూపించాలన్నారు. లోకేష్ ఇలా ఎంతగా ప్రచారం చేసినా చివరకు జనాలు మాత్రం వైసీపీవైపే సంపూర్ణ మొగ్గుచూపించారు. పార్టీని గెలిపించుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడే క్యాంపు వేసి మరీ ప్రచారం చేశారు.

కుప్పం గెలుపును సవాలుగా తీసుకుని రెండుపార్టీల నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. దొంగఓట్లు వేయించుకున్నారంటు రెండుపార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఆరోపణలను పరిశీలిస్తే రెండుపార్టీలు కూడా దొంగఓట్లకు గట్టిగానే ప్రయత్నం చేసినట్లు అర్ధమైపోతోంది. కాకపోతే అధికారంలో ఉండటం వైసీపీకి కచ్చితంగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

ఇదే విషయమై వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతు కుప్పంకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసినా 30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా కనీసం మౌళిక సదుపాయాల విషయంలో కూడా చంద్రబాబు శ్రద్ధ చూపలేదంటు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే జనాలు వైసీపీని గెలిపించినట్లు కౌన్సిలర్లు చెప్పారు.