Begin typing your search above and press return to search.

గెస్ట్​హౌస్​లో టీకా తీసుకున్న కుల్డీప్​ యాదవ్​..! వైద్యశాఖ మండిపాటు..!

By:  Tupaki Desk   |   19 May 2021 8:30 AM GMT
గెస్ట్​హౌస్​లో టీకా తీసుకున్న కుల్డీప్​ యాదవ్​..! వైద్యశాఖ మండిపాటు..!
X
టీమిండియా క్రికెటర్​ కుల్దీప్​ యాదవ్​ ఇటీవల కోవిడ్​ టీకా తీసుకున్న విషయం తెలిసిందే. వైద్య సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఓ గెస్ట్​హౌస్​ లో కుల్దీప్​ టీకా తీసుకున్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్​ కూడా చేశాడు. ‘నేను ఇప్పుడే టీకా తీసుకున్నాను. మీరు కూడా టీకా తీసుకోండి’ అంటూ ట్వీట్​ చేశాడు. అయితే కుల్​దీప్​ టీకా తీసుకున్న ప్రదేశం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఆస్పత్రిలో కాకుండా ఓ గెస్ట్​హౌస్​ లో అతడికి టీకా ఎలా ఇచ్చారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై కాన్పూర్​ వైద్యశాఖ స్పందించింది.

ఈ వ్యవహారంపై కాన్పూర్​ వైద్యశాఖ సీరియస్​ గా స్పందించింది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గెస్ట్​హౌస్​ లో ఎలా టీకా తీసుకున్నారంటూ మండిపడింది. నిజానికి కుల్​దీప్​.. స్థానిక గోవింద్‌నగర్‌ లోని జగదీశ్వర్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్‌ నగర్‌ నిగం గెస్ట్​హౌస్​ లో టీకా తీసుకున్నాడు. సెలబ్రిటీ అయినా, రాజకీయనేత అయినా ఆస్పత్రిలో టీకా తీసుకోవాల్సిందే. ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ప్రముఖులు సైతం ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనే టీకా తీసుకున్నారు.

కానీ కుల్దీప్​ యాదవ్​ ఓ గెస్ట్​హౌస్​ లో టీకా తీసుకోవడం.. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం ట్వీట్టర్​ లో పోస్టు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.ఈ విషయంపై కాన్పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అలోక్‌ తివారి విచారణకు ఆదేశించారు. ఎవరి అనుమతితో గెస్ట్‌హౌజ్‌ లో కుల్దీప్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాడనే అంశంపై విచారణ చేపట్టనున్నారు. ఐపీఎల్‌-2021 వాయిదా పడటంతో కుల్దీప్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లాడు. ఆయనను ఇంగ్లండ్​ పర్యటనకు సెలెక్ట్​ చేయలేదు. ఈ నేపథ్యంలో కుల్​దీప్​ టీకా ట్వీట్​ సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.