Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప‌నితీరు.. అవార్డు వ‌చ్చేలా చేసింది

By:  Tupaki Desk   |   4 Sept 2017 10:39 AM IST
కేటీఆర్ ప‌నితీరు.. అవార్డు వ‌చ్చేలా చేసింది
X
కొన్నిసార్లు మ‌నం కోరుకున్నా.. కోరుకోకున్నా పోలిక‌లు వ‌చ్చేస్తుంటాయి. పోలిక‌ల‌కు అవ‌కాశం ఉండేలా వ్య‌వ‌హ‌రిస్తే ఇక చెప్పాల్సిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. త‌న తీరుతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వ్య‌క్తి.. తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్ కుమారుడు ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్‌.

తండ్రి మాదిరే వాక్ చాతుర్యంతో పాటు.. క‌లుపుగోలుత‌నం.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అంద‌రితో క‌లిసిపోవ‌టం.. స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆయ‌న‌కు అల‌వాటు. అదే ఆయ‌న‌కు ప్ల‌స్ కూడా. పార్టీ అధినేత కొడుకుగా అంద‌రికి ప‌రిచ‌య‌మైనా.. త‌న తీరుతో అంద‌రిని ఆక‌ట్టుకోవ‌ట‌మే కాదు.. ఏకంగా కేసీఆర్ త‌ర్వాతి స్థానాన్ని సొంతం చేసుకున్నార‌ని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్‌.. ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించారు. హైద‌రాబాద్ లో ఐటీ రంగం మ‌రింత విస్త‌రించేందుకు వీలుగా ఆయ‌న ప‌లు సంస్థ‌ల అధిప‌తుల‌తో.. కీల‌క అధికారుల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. ఐటీ రంగంలో హైద‌రాబాద్ ను త‌ర్వాతి ద‌శ‌కు తీసుకెళ్లేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో ఐటీ శాఖ‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేశ్‌ కు అప్ప‌జెప్ప‌టం తెలిసిందే. దీంతో.. ఇద్దరి మ‌ధ్య పోలిక త‌ర‌చూ రావ‌టం మామూలైంది.రాజ‌కీయంగా చూస్తే.. కేటీఆర్ కంటే లోకేశ్ జూనియ‌ర్ అని చెప్పాలి. ఐటీ మంత్రిగా కూడా లోకేశ్ ఈ మ‌ధ్య‌నే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయ‌టం క‌ష్ట‌సాధ్య‌మైన వ్య‌వ‌హారం. దీన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు లోకేశ్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి రావ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది.

ఇలాంటి వేళ‌లో స్కోచ్ సంస్థ‌.. ఉత్త‌మ ఐటీ మినిస్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. క్రియేటివిటీతో రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఐటీ రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నందుకు ఈ పుర‌స్కారానికి ఎంపిక చేసిన‌ట్లుగావెల్ల‌డించారు. ఈ నెల 9న ఢిల్లీలో జ‌రిగే 49వ స్కోచ్ స‌మ్మిట్ లో ఈ అవార్డును కేటీఆర్‌కు అంద‌చేయ‌నున్నారు.

ఐటీరంగంలో కేటీఆర్ ప‌నితీరుకు నిద‌ర్శ‌నంగా అవార్డు రావ‌టం ఏపీ మంత్రి లోకేశ్ మీద ఒత్తిడి పెంచ‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి. స‌హ‌జంగానే రెండు రాష్ట్రాల్లోని వీరిద్ద‌రి ప‌ని తీరు మీద పోలిక‌లు త‌ర‌చూ న‌డుస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ప‌ని తీరుకు అవార్డు వ‌స్తే.. లోకేశ్ ప‌ని తీరుకు ఎలాంటి గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పక‌త‌ప్ప‌దు.