Begin typing your search above and press return to search.

మంత్రిగా కేటీఆర్ జీతం ఎంతంటే?

By:  Tupaki Desk   |   19 July 2017 12:53 PM IST
మంత్రిగా కేటీఆర్ జీతం ఎంతంటే?
X
తెలంగాణ‌లో అధికార పార్టీ యువ నేత‌గా - ఆ పార్టీ అధినేత - రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న‌యుడిగా క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు... తండ్రి ఆధ్వ‌ర్యంలోని కేబినెట్‌లో కీల‌క శాఖ‌ల మంత్రిగా త‌న‌దైన స్టైల్లో దూసుకుపోతున్నారు. సాధార‌ణంగా కేసీఆర్ కుమారుడిగా - తెలంగాణ ఉద్య‌మంలో పాలుపంచుకునేందుకంటూ విదేశాల్లో ఉద్యోగాన్ని వ‌దిలేసి వ‌చ్చిన కేటీఆర్ స్థితిమంతుడిగానే మ‌నంద‌రికీ తెలుసు. అయితే త‌న కుటుంబ ఆస్తుల‌ను ఏనాడూ బ‌య‌ట‌పెట్ట‌ని కేటీఆర్‌... తాజాగా ట్యాక్స్ చెల్లింపుల్లో త‌న‌దైన మార్కు స్టైల్‌ కు శ్రీకారం చుట్టేశారు.

కేటీఆర్‌ కు స‌రిస‌మానులుగా ఉన్న దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి - టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ లు త‌మ ఆస్తుల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు క‌ట్టి మ‌రీ ప‌న్ను చెల్లిస్తున్న విష‌యం తెలిసిందే. ఆదాయ‌ప‌న్ను చెల్లింపు సంద‌ర్భంగా నారా లోకేశ్ కంటే కూడా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న మొత్తం ఆస్తుల‌ను లెక్క‌గ‌ట్టి మ‌రీ ప‌న్ను చెల్లిస్తూ వ‌స్తున్నారు. ఇక నారా లోకేశ్ విష‌యానికి వ‌స్తే... త‌న ఆస్తుల‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల‌ను ఏటా వెల్ల‌డిస్తూ వ‌స్తున్నారు.

అయితే ఇందుకు భిన్నంగా ఇప్ప‌టిదాకా ఈ త‌ర‌హా వైఖ‌రిని ఏనాడూ అవ‌లంభించ‌ని కేటీఆర్‌... తాజాగా త‌న‌దైన ట్యాక్స్ స్టైల్‌ ను ప్రారంభించేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... గ‌తేడాదికి సంబంధించిన త‌న ఆదాయం - దానికి స‌రిపోయినంత‌గా ప‌న్ను చెల్లిస్తూ కొత్త సంప్ర‌దాయానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఆస్తుల‌ను వెల్ల‌డించ‌కుండానే మంత్రిగా త‌న‌కు అందిన వేత‌నాన్ని వెల్ల‌డిస్తూ ఆదాయ‌ప‌న్ను రిట‌ర్న్ దాఖ‌లు చేశారు. అది కూడా త‌న‌కు తానుగా ప‌న్ను క‌ట్ట‌కుండా... ఆ ప‌న్ను క‌ట్టే బాధ్య‌త‌ను కూడా ఆయ‌న తాను నిర్వ‌హిస్తున్న ప‌రిశ్ర‌మల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌ కు ఆ బాధ్య‌త‌ను అప్ప‌జెప్పారు.

కేటీఆర్ ఆదేశాల మేర‌కు ఆయ‌న వేత‌నం, ఆ వేత‌నానికి స‌రిప‌డే ప‌న్నును చెల్లిస్తున్న‌ట్లు ఇప్పుడు జ‌యేశ్ రంజ‌న్ కేటీఆర్ ఆదాయ‌ప‌న్ను రిట‌ర్న్‌ను దాఖ‌లు చేశారు. ఈ విష‌యాన్ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి పేరిట జ‌యేశ్ రంజ‌న్ ఓ ఉత్త‌ర్వును వెలువ‌రించారు. ఈ ఉత్త‌ర్వు ప్ర‌కారం గ‌తేడాది మంత్రిగా ప‌నిచేసినందుకు గానూ కేటీఆర్‌ కు రూ.7.22 ల‌క్ష‌ల మేర వేత‌నం అందింద‌ట‌. ఈ వేత‌నం ఆధారంగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను మంత్రి జీతభత్యాల నుంచి ట్యాక్స్ ను చెల్లిస్తున్నట్టు జ‌యేశ్ రంజ‌న్ ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ వేత‌నం ఏ స‌మ‌యంలో మంత్రి అందుకున్నార‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన రంజ‌న్‌... 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి 28వ తేదీ వరకు కేటీఆర్ పన్ను చెల్లించినట్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.