Begin typing your search above and press return to search.

శబాష్ కేటీఆర్‌.. జైట్లీ మ‌న‌సును గెలుచుకున్నావు

By:  Tupaki Desk   |   6 April 2018 10:36 AM IST
శబాష్ కేటీఆర్‌.. జైట్లీ మ‌న‌సును గెలుచుకున్నావు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప‌రిణితికి ఇదో నిద‌ర్శ‌నం. విధానాల ప‌రంగా ఎంత‌విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తున్న‌ప్ప‌టికీ...ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో త‌న హుందాత‌నాన్ని చాటుకోవ‌డంలో కేటీఆర్ ముందుంటారు. అలాంటి విశిష్ట ఆలోచ‌న తీరుతోనే తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌న్నిహితుడైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విష‌యంలో ఆయ‌న స్పందించారు. బీజేపీ ముఖ్య‌నేత‌ - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్ర కావటంతో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు స్పష్టం చేశారు.

త‌న అనారోగ్యం గురించి జైట్లీ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. `ప్రస్తుత పరిస్థితిలో బయట తిరగొద్దని.. అలా వెళ్తే ఇన్‌ ఫెక్షన్‌ రావచ్చనీ వైద్యులు సూచించారు. చికిత్స కొన‌సాగుతోంది.` అని జైట్లీ వివ‌రించారు. అయితే ఈ ట్వీట్‌ పై కేటీఆర్ స్పందించారు. `స‌ర్ మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు. మీరు గ‌తం కంటే మ‌రింత ఉత్సాహంగా మీ దైనందిన కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను` అని ట్వీట్ చేశారు. కాగా, కేటీఆర్ ట్వీట్‌ పై ప‌లువురు నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...అనారోగ్యం కార‌ణంగానే మంగళవారం రాజ్యసభలో నూతన సభ్యులతో పాటు జైట్లీ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. కొత్తగా ఎన్నుకోబడిన 58 మంది సభ్యులలో 55 మంది ఎంపీలు ఏప్రిల్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేయని ముగ్గురు సభ్యులలో జైట్లీ కూడా ఉన్నారు. గత పది రోజులుగా దాదాపుగా ఏ అధికారిక కార్యక్రమంలోనూ జైట్లీ పాల్గొనలేదు. ఇంటివద్ద నుంచే ముఖ్యమైన పనులు పూర్తి చేస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రత్యేక భవనంలో జైట్లీ చికిత్స అందించనున్నారు.