Begin typing your search above and press return to search.

జానారెడ్డిని చూసి మేల్కొన్నా- కేటీఆర్‌

By:  Tupaki Desk   |   2 Dec 2018 7:00 AM IST
జానారెడ్డిని చూసి మేల్కొన్నా- కేటీఆర్‌
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు త‌మ ప్ర‌చారాన్ని మ‌రింత ఉధృతం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌యత్నాన్ని రాజ‌కీయ పార్టీలు చేస్తున్నాయి. మాదాపూర్‌ లో శనివారం నిర్వహించిన స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ కంపెనీల సీఈవోలు - బిజినెస్‌ హెడ్స్‌ - ఐటీ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...హైదరాబాద్‌ అన్ని రకాలుగా అనుకూలమైన నగరమని - టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా మారిందన్నారు. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని తెలిపారు. దేశంలోనే హైదరాబాద్‌ కు ఓ ప్రత్యేకత ఉందన్నారు. ఆపిల్‌ - గూగుల్‌ - మైక్రోసాఫ్ట్‌ - ఉబర్‌ లాంటి ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌ లో తమ సేవలు విస్తరించాయని కేటీఆర్‌ తెలిపారు. దేశ జీడీపీలో అధిక శాతం మెట్రో పాలిటన్‌ నగరాలదేనని చెప్పారు. క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ లో హైదరాబాద్‌ ది బెస్ట్‌ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఈ చ‌ర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్‌కు ఓ చిత్ర‌మైన స‌మ‌స్య ఎదురైంది. ఓ వ్య‌క్తి ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగారు. `బహిరంగ సభలు - రోడ్డుషోలతో ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు...టెక్నాలజీపై పట్టున్న వ్యక్తిగా మీరు సైతం ఇలా చేయడం ఏంటి?`` అంటూ కేటీఆర్‌ ను సూటిగా ప్రశ్నించగా దానికి మంత్రి కేటీఆర్‌ ఆసక్తికరంగా స్పందించారు. ‘రాజకీయాలు ఎంతో ఆసక్తికరమైనవి. నాకు కూడా వ్యక్తిగతంగా రోడ్డు షోలతో ప్రజలను ఇబ్బందులు పెట్టడం - ట్రాఫిక్‌ చిక్కులు వంటివి నచ్చవు. కానీ ప్రతిపక్షాలు చంద్రుడిలో మచ్చలు ఉన్నాయని చూపిస్తే...మేం చంద్రుడిని చూపించాల్సిందే. రాజకీయాల్లో ఇవి తప్పవు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. గ‌తంలో ఓ సారి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో చేశానని - ప్రచారం చేయకపోయినా ప్రజలు గెలిపిస్తారని ఇంట్లో కూర్చున్నారు. అయితే, ఆయన్ను ప్రజలు ఓడించారు. ఇలా... రాజకీయాల్లో కొన్ని తప్పవు. కొందరికి ఆన్‌ లైన్‌ - కొందరికి ప్రత్యక్షంగా చెప్పాల్సిందే. అందుకే ఇటు ట్విట్టర్‌ వేదికగా అటు సభల ద్వారా మేం సమాచారం చేరవేస్తున్నాం. ఇందులో టీఆర్‌ ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా ఆదివారం బహిరంగ సభ నిర్వహించబోతున్నాం’ అని వివరించారు.