Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ - సత్య నాదెళ్ల ఆన్ లైన్ చర్చ ...

By:  Tupaki Desk   |   23 Feb 2021 6:30 AM GMT
కేటీఆర్‌ - సత్య నాదెళ్ల ఆన్ లైన్ చర్చ ...
X
సోమవారం హైదరాబాద్ వేదికగా 18వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకి ముఖ్య అతిధిగా మంత్రి కేటీఆర్ హాజరైయ్యారు. జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి ఏటా ఇచ్చే ‘జీనోమ్‌ వ్యాలీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డును ఈసారి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రూపొందించిన భారత్‌ బయోటెక్‌కు అందించారు. ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న జీనోమ్‌ వ్యాలీ అనేక అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ తయారీతోపాటు ప్రపంచానికి సరఫరా చేసే బాధ్యతలను ఇక్కడి హెటెరో ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థలు చేపట్టడం సంతోషకరమని చెప్పారు. అరబిందో ఫార్మా 450 మిలియన్‌ డోసుల సామర్థ్యంతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది అనేక దేశాలు తీవ్రంగా నష్టపోగా తెలంగాణలోని లైఫ్‌ సైన్సెస్‌ రంగం మాత్రం గణనీయమైన వృద్ధి నమోదు చేసిందన్నారు. ఈ రంగంలో గత ఏడాది రూ.3700 కోట్ల పెట్టుబడులు రాగా, 14వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కేటీఆర్‌ వెల్లడించారు.

ఇక బయో ఆసియా సదస్సు లో రెండో రోజు కూడా కొనసాగనుంది. నేడు ఈ సదస్సు ఆన్‌ లైన్లో సాగనుంది. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోని ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. కేంద్ర ఔషధ మంత్రిత్వ శాఖ, ఔషధ నాణ్యత, నియంత్రణ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.45 నుంచి 15 నిమిషాల పాటు మంత్రి కేటీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో మాట్లాడనున్నారు. ‘చర్చా 2021- హెల్త్‌ కేర్‌ టు హిట్‌ రీఫ్రెష్‌’ అనే అంశంపై వీరిద్దరి మధ్య సంభాషణ జరగనుంది.