Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు గౌర‌వం..మంత్రికి టెన్ష‌న్‌!

By:  Tupaki Desk   |   27 Dec 2019 11:01 PM IST
కేటీఆర్‌ కు గౌర‌వం..మంత్రికి టెన్ష‌న్‌!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన ఎన్నిక‌లు...ఓ మంత్రికి టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌ కు షాకిచ్చిన జిల్లా...మ‌ళ్లీ అదే అనుభ‌వాన్ని అందిస్తుందా? లేక‌పోతే గులాబీ పార్టీకి జైకొడ‌తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలా హాట్ టాపిక్‌ గా మారింది నిజ‌మాబాద్ జిల్లా. అసెంబ్లీ ఎన్నికల స్పూర్తితో నిజామాబాద్ నగరపాలక సంస్ధతో పాటు 6 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని అధికార టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. అదే స‌మ‌యంలో...నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలో గెలుపుతో ఊపు మీద ఉన్న కమలం పార్టీ ఈ సారి మెజార్టీ మున్సిపాలిటీలపై కాషాయ జెండా రెపరెపలాడించాలని ఆ పార్టీ నేత‌లు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. దీంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలపై చ‌ర్చ జ‌రిగింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేషన్‌ తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనుండగా మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు తొలిసారిగా జరగనున్నాయి. ఎల్లారెడ్డి - భీంగల్ - బాన్సువాడ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా కొత్తగా ఆవిర్భవించాయి. నిజామాబాద్ నగర పాలక సంస్ధతో పాటు కామారెడ్డి - ఆర్మూర్ - బోధన్ మున్సిపాలిటీల్లో శివారు కాలనీలు - పలు గ్రామ పంచాయతీల విలీనంతో పట్టణాల పరిధి పెరిగింది. మున్సిపాలిటీలపై తమ జెండా ఎగురువేయాలని రాజకీయ పార్టీలు ఉవ్విళ్లురుతున్నాయి.

జోరు మీదున్న కారు పార్టీ సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను న‌మ్ముకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు - పట్టణాల్లో జరిగిన అభివృద్దిని నినాదాలతో ముందుకు తీసుకు పోతున్నారు. ప్రజా సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ నేతలు అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో పడ్డారు. పట్టణాల్లో బలం పెంచుకున్న ఆ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు యువకులు ఉత్సాహాం చూపుతున్నారు. ఇదే స‌మ‌యంలో - ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు - మోడీ పాలనలో గొప్ప విషయాలను ఓటర్లకు చేరవేస్తూ ముందుకు సాగేలా కార్యచరణ సిద్దం చేస్తూ... అధికార పార్టీని ఢీకొట్టేందుకు ముందుకు సాగుతున్నారు.

మ‌రోవైపు జిల్లాలో గ‌తంలో బ‌లంగా ఉండి...కొద్దికాలంగా వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల్లో సత్తా చాటాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు 50శాతానికి పైగా యువతకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో సమస్యలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేలా కార్యచరణ సిద్దం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బలాన్ని చాటుకునేందుకు గెలుపు వ్యూహాలు రచించే పనిలో ఆ నేతలు పడ్డారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు MIM పార్టీ కూడా నిజామాబాద్ నగర పాలక సంస్ధలో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇలా అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన నిజ‌మాబాద్‌ పార్లమెంట్ పరిధి మున్సిపల్ ఎన్నికలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఈ గెలుపు మంత్రి సీటుకు ఎస‌రుపెడుతుందా? గెలుపు-ఓట‌ముల‌తో సంబంధం లేకుండా ఆయ‌న బెర్తు భ‌ద్రంగానే ఉంటుందంటున్నారు.