Begin typing your search above and press return to search.

324 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:37 PM IST
324 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్
X
ఒక్కోటి 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఇల్లు కొనాలంటే రూ. 50 లక్షల ఖర్చు అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలని కేటీఆర్ కోరారు.

హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూం ఇళ్లను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 72 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి భవనాలు పేదలకు నిర్మించి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

పేదలకు ఇస్తున్న ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వ్యాధులకు దూరంగా ఉండాలంటే పారిశుధ్యం ముఖ్యమని మంత్రి సూచించారు.

కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిన ఉన్న ఆయన రాలేదు. మంత్రి కేటీఆర్ ను తీవ్రంగా విమర్శించి టార్గెట్ చేసే రేవంత్ రెడ్డి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అందరూ ఊహించినా ఆయన గైర్హాజరుతో సభ ప్రశాంతంగానే ముగిసింది. కేటీఆర్, రేవంత్ సభ పంచుకుంటే చూడాలని చూసిన వారికి నిరాశ మిగిలింది. రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదన్నది తెలియరాలేదు. ఆయన ఢిల్లీకి పీసీసీ పోస్టు లాబీయింగ్ కోసం కోసం వెళ్లినట్లు తెలిసింది.