Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ ను మెచ్చుకున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   11 Sept 2016 10:16 AM IST
ప‌వ‌న్‌ ను మెచ్చుకున్న కేటీఆర్
X
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు - ఐటీ శాఖల మంత్రి కేటీరామారావు మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక ప్యాకేజీ - కాకినాడలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సభ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ప‌వ‌న్ వ్యక్తిగతంగా మంచివాడని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాలలో ఏవిధంగా ముందుకు సాగాలనే విషయమై పవన్‌ కు స్పష్టత కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇదే సంద‌ర్భంగా ప‌వ‌న్ తీరును రాజ‌కీయ కోణంలో కేటీఆర్ త‌ప్పుప‌ట్టారు. రాజకీయాలలో ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని పవన్‌ కళ్యాణ్‌ విషయంలో మరోసారి రుజువైందని కేటీఆర్‌ అన్నారు. తన రాజకీయాలు సీమాంధ్రకే పరిమితమనే సంకేతాలను జనసేన అధ్యక్షుడు ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం. ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తానని చెప్పడం ద్వారా ఏపీకే ప‌వ‌న్‌ పరిమితమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే స‌మ‌యంలో గ‌తంలో బీమ‌వ‌రంలో పోటీచేస్తాన‌ని చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ వ‌ద్ద మీడియా ప్ర‌స్తావించగా...పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించ‌బోమ‌ని కేటీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. సీమాంధ్రలో తమ పాత్ర ఏమి ఉండదని, తమకు ఓటు వేసి గెలిపించింది తెలంగాణ ప్రజలని - అలాంటప్పుడు కర్ణాటక - ఆంధ్రప్రదేశ్‌ - ఇతర రాష్ట్రాలతో పనేమి ఉంటుందని ఆయ‌న ప్రశ్నించారు. పద్నాలుగేళ్ళపాటు రాజీలేని రీతిలో ఉద్యమాన్ని నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర భావజాలాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళడంలో తమ నేత కె.చంద్రశేఖర్‌ రావు విజయం సాధించారని, చివరకు ప్రజలను ఏకతాటిపై నడిపించడంలో కృతకృత్యులై తెలంగాణను సాధించిన సంగతిని కేటీఆర్ గుర్తు చేశారు. అలా తమ పార్టీ అంకితభావంతో కూడిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్‌ లో జ‌రిగిన అన్యాయాల‌ను స‌రిదిద్దేందుకు తెలంగాణలో 24 గంటలు కాదు గదా - 48 గంటలు పనిచేసినా తీరికలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తున్నదంటే టీఆర్‌ ఎస్‌ చలవేనని కేటీఆర్ విశ్లేషించారు. ఏపీకి ప్ర‌స్తుతం ద‌క్కిన ప్ర‌త్యేక ప్యాకేజీ - పెద్ద ఎత్తున వ‌చ్చిప‌డుతున్న విద్యాసంస్థ‌లు - రాజధాని రూపంలో ప్ర‌పంచ గుర్తింపు ద‌క్కించుకునే అవ‌కాశం వంటివి విభ‌జ‌న వ‌ల్లే సాధ్య‌మైన‌వ‌ని కేటీఆర్ వివరించారు. ఆనాడు విభ‌జ‌న‌కు తాము కార‌కుల‌మంటూ విమ‌ర్శించిన వారు ప్ర‌స్తుతం వారి స్వ‌రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని గ‌మ‌నించాల‌న్నారు. టీఆర్ఎస్ కార‌ణంగా విభ‌జ‌న జ‌ర‌గ‌క‌పోతే ఈ అభివృద్ధి సాధ్య‌మ‌యేదా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.