Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్... 31 వరకు ఈ మూడు జిల్లాలు లాక్ డౌన్

By:  Tupaki Desk   |   22 March 2020 1:22 PM GMT
కరోనా ఎఫెక్ట్... 31 వరకు ఈ మూడు జిల్లాలు లాక్ డౌన్
X
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వైరస్ విస్తరణ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ బారిన కొత్త కొత్త దేశాలు, కొత్త ప్రాంతాలు పడిపోతున్నాయి. వెరసి ఈ వైరస్ బారిన పడిన దేశాలు, ప్రాంతాలు వాటికవే లాక్ డౌన్ ప్రకటించేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే నవ్యాంధ్రలోనూ కనిపించింది. ఏపీలోని కృష్ణా జిల్లాతో పాటుగా విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలు ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ కానున్నాయి. ఈ మేరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంచలన ప్రకటన చేసింది.

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరు జిల్లాలో నమోదు కాగా... రెండో కేసు ప్రకాశం జిల్లాలో, మూడో కేసు విశాఖపట్నం జిల్లాలో నమోదు అయ్యింది. తాజాగా నాలుగో కేసు తూర్పు గోదావరి జిల్లాలో, ఐదో కేసు కృష్ణా జిల్లాకు చెందిన విజయవాడ నగరంలోని వన్ టౌన్ లో నమోదైంది. దీంతో ఎక్కడిక్కడ జనం బెంబేలెత్తిపోతున్నారు. విజయవాడలో అయితే ఆదివారం నాడు నిర్వహించిన జనతా కర్ఫ్యూను మరో మూడు రోజుల పాటు కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనంతనే... నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు... నగరంలో మరో మూదు రోజుల పాటు నిర్బంధ జనతా కర్ఫ్యూను అమలు చేయనున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు.

అయితే ఇటు కృష్ణా జిల్లాతో పాటు విశాఖ, ప్రకాశం జిల్లాల్లో కరోనా విస్తరణ పరిస్థితిపై సమగ్ర వివరాలు తెప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం... ఈ నెలాఖరు వరకు ఈ మూడు జిల్లాల్లో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ను ప్రకటించేసింది. ఈ ప్రకటన విన్నంతనే... ఆ మూడు జిల్లాల్లో పరిస్థితి ఏ రేంజిలో ఉందన్న వాదనలపై ఆసక్తికర చరచ్చ మొదలైంది. అయితే ఈ మూడు జిల్లాలతో పాటు ఏపీలో ప్రస్తుతం కరోనా గురించి అంతగా భయాందోళన చెందాల్సిన పని లేదని, కరోనా విస్తరణను ఎఖ్కడికక్కడ నిలువరించే పనిలో భాగంగానే ఆ మూడు జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారని అధికారులు చెబుతున్నారు.