Begin typing your search above and press return to search.

చివరిరోజు పోటెత్తిన ప్రముఖులు..బాబు పొగడ్తలు!

By:  Tupaki Desk   |   23 Aug 2016 8:52 AM GMT
చివరిరోజు పోటెత్తిన ప్రముఖులు..బాబు పొగడ్తలు!
X
కృష్ణా పుష్కరాల చివరి రోజైన మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడలో గల పున్నమిఘాట్‌ - దుర్గా ఘాట్‌ - పద్మావతి ఘాట్‌ - పవిత్ర సంగమం ఘాట్‌ సహా గుంటూరు - కర్నూలు జిల్లాల్లోని పలు ఘాట్లలో వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ - నల్గొండ జిల్లాలోని బీచుపల్లి - సోమశిల - గొందిమళ్ల - నాగార్జునసాగర్‌ తదితర ఘాట్లలో లక్షలాది మంది భక్తులు పుణ్యసాన్నాలు ఆచరిస్తున్నారు. చివరిరోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు.

ఈ సందభ్రంగా పలువురు ప్రముఖులు ఈరోజు ఉదయం విజయవాడలోని పున్నమిఘాట్‌ లో పుష్కరస్నానం ఆచరించారు. వీరిలో మంత్రులు దేవినేని ఉమ - శిద్దా రాఘవరావు - ఎమ్మెల్సీ సోమిరెడ్డి - నటుడు సాయికుమార్‌ - సినీ నిర్మాత అశోక్‌ కుమార్‌ ఉన్నారు. ముక్త్యాలలోని కోటిలింగాల ఘాట్‌ లో గణపతి సచ్చిదానంద స్వామి పుష్కర స్నానం చేశారు.

చివరి రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలు - ప్రభుత్వం కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చనడానికి కృష్ణా పుష్కరాల నిర్వహణే నిదర్శనమని.. పోలీసులంటే లాఠీలు కాదు.. సేవకులు అన్న పేరు ఈ పుష్కరాల ద్వారా రావడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చివరిరోజు అర్ధరాత్రి 12గంటల వరకు పుష్కర విధుల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ఒకరోజు శుభకార్యం చేయాలంటేనే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన భారమని.. అలాంటిది 12రోజుల పుష్కరాలువిజయవంతం చేయడం నిజంగా అద్భుతమేనని తనను తాను అభినందించుకున్న చంద్రబాబు.. అధికారులను ప్రశంసలతో ముంచెత్తారు.

కాగా.. పుష్కరాల సంభరాలు నేటితో ముగియనుండటంతో.. రేపటి నుంచి ఇక ప్రజా సమస్యలపైనా, ప్రత్యేక హోదాపైనా ఇదే ఊపుతో సీఎం - మంత్రులు పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.