Begin typing your search above and press return to search.

జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి...?

By:  Tupaki Desk   |   4 March 2022 7:40 PM IST
జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి...?
X
గోదావరి జిల్లాల్లో ఈసారి ఎన్నికలు వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మీద  మోజు తీరిన నేపధ్యం ఒక వైపు ఉంటే పవన్ కళ్యాణ్ మీద అంతకంతకు ఆదరణ పెరుగుతున్న సీన్ ఇంకో వైపు. ఈ పరిణామాల నేపధ్యంలో గోదావరి జిల్లాల్లో ఈసారి రాజకీయ  దూకుళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీకి తలాక్ అనేస్తారు అని తెలుస్తోంది.

అందులో ఫస్ట్ పేరు మాజీ మంత్రి, వైసీపీకి చెందిన కీలక నేత కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు వినిపిస్తోంది. కొత్తపల్లిది పాతికేళ్లకు పైబడిన రాజకీయం. ఆయన పశ్చిన గోదావరి జిల్లా నర్సాపురం ఉంచి ఒకసారి ఎంపీగా నెగ్గారు. అదే విధంగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. అన్నింటికీ మించి పార్టీలను మార్చేయడంతో ఆయనకు రికార్డు ఉంది.

ఆయన మొదట టీడీపీలోనే ఉంటూ కీలక పదవులు చేపట్టారు. అయితే 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీ చేసి ఓడారు. ఇక ఆ మీదట కాంగ్రెస్ లో  చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. 2014 నాటికి వైసీపీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో టీడీపీ అధికారంలోకి రావడంతో అందులో చేరిన కొత్తపల్లి అధికార పార్టీ నేతగా హవా చేశారు. ఇక  2019 ఎన్నికల ముందు మళ్లీ వైసీపీ కండువా కప్పేసుకున్నారు.

ఈసారి ఆయనకు నర్సాపురం ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. అయినా ముదునూరు ప్రసాదరాజు విజయం కోసం పనిచేశారు. మూడేళ్ళు గడచినా నామినేటెడ్ పదవులు ఏవీ ఇవ్వ‌లేదు. ఈ నేపధ్యంలో ఆయన నర్సాపురం జిల్లా కేంద్రం అంటూ సొంత పార్టీ మీదనే తిరుగుబాటు మొదలెట్టారు.

నిజానికి ఈ అంశం విపక్షాలు టేకప్ చేస్తున్నాయి. వాటిని మించి కొత్తపల్లి వైసీపీ మీద నిప్పులు చెరుగుతున్నారు. అంతే కాదు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యే మీద ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. ఆయనను గెలిపించాలని జనాలను కోరినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటాను అని గట్టిగానే  కొట్టేసుకున్నారు.

ఇదంతా పొలిటికల్ డ్రామా అని రాజు గారి మద్దతుదారులు అంటున్నారు. సరిగ్గా ఇక్కడే కొత్తపల్లి రాజకీయం మీద అందరికీ డౌట్లు పుట్టుకొస్తున్నాయి. కొత్తపల్లి అనేక పార్టీలు మారారు. ఇపుడు కూడా ఆయన ఆలోచనలు అలాగే ఉన్నాయని అంటున్నారు. ఆయన ఈసారి జనసేనలోకి వెళ్తారని అంటున్నారు. గోదావరి జిల్లాలలో జనసేనకు బాగా ఆదరణ ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇంకో వైపు చూస్తే కొత్తపల్లి పక్కా ప్లాన్ తోనే ఇలా చేస్తున్నారు అని తెలుస్తోంది.

ఇక 2024 ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయని, ఈసారి ఏపీలో అధికారం ఖాయమని, మరోసారి అలా జనసేన కోటాలో మంత్రిగా కూడా కావచ్చు అన్నదే ఆయన ఎత్తుగడగా ఉందని అంటున్నారు. అందుకే ఆయన కోరి మరీ జిల్లా కేంద్రం డిమాండ్ ని పెట్టి వైసీపీని బదనాం చేస్తున్నారు

అని చెబుతున్నారు. ముదునూరు ప్రసాదరాజు మీద 2012లో గెలిచిన కొత్తపల్లి 2024లో మళ్ళీ ఆయన్ని ఓడిస్తాను అని శపధాలు చేస్తున్నారు. మరి వైసీపీ నేతలు కూడా సుబ్బారాయుడి రాజకీయ లెక్కలు తెలుసు కాబట్టే ఏ పదవీ హై కమాండ్ ఇవ్వలేదు అంటున్నారుట.