Begin typing your search above and press return to search.

కొత్తగూడెం DSP కొడుకు ఎంత మందికి అంటించాడు అంటే!

By:  Tupaki Desk   |   26 March 2020 6:00 AM GMT
కొత్తగూడెం DSP కొడుకు ఎంత మందికి అంటించాడు అంటే!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 200 దేశాలకు విస్తరించింది. గతేడాది డిసెంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక వైరస్ ఖండంతరాలను దాటి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 21,400 మంది ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 4.72 లక్షలు దాటింది. ఇకపోతే , తెలంగాణలో కూడా కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 41కి చేరింది. కొత్తగూడెంలో పోలీసు అధికారి కుమారుడికి కరోనా పాజిటివ్‌ గా తేలిన విషయం తెలిసిందే. ఇటీవలే ఇతడు లండన్ నుంచి తిరిగొచ్చాడు.

తాజాగా నమోదైన రెండు కేసులు సదరు పోలీసు అధికారి, వారి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న మహిళ అని తెలుస్తోంది. దీంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది. కుమారుడు విదేశాల నుంచి వచ్చిన విషయం దాచిపెట్టిన అంశంలో కొత్తగూడెం పోలీసు అధికారిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొత్తగూడెం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు లండన్‌ లో చదువుతూ , మార్చి 18న లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు. ఇక్కడ నుంచి కారులో కొత్తగూడెం వెళ్లినట్లు తెలుస్తోంది. మార్చి 18 నుంచి 20 వరకు కొత్తగూడెంలోని తన నివాసంలోనే ఉన్నాడు. కుటుంబసభ్యులతో పాటు కొంత మంది బంధువులు, మిత్రులను కలిసినట్లు సమాచారం. మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌ లో హైదరాబాద్ తరలించగా కరోనా పాజిటివ్ వచ్చింది.

యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అతడి కుటుంబ సభ్యులను హైదరాబాద్ తీసుకొచ్చి క్వారంటైన్‌ లో ఉంచారు. తాజాగా వీరిలో డిఎస్పీ, అతని ఇంట్లో వంట మనిషికి కరోనా పాజిటివ్‌ గా తేలడం అలజడి రేపుతోంది. డిఎస్పీ, అతని ఇంట్లో వంట మనిషి ఈ వ్యవధిలో ఎవరెవరిని కలిసారని దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.