Begin typing your search above and press return to search.

కొండపోచమ్మ కాలువకు గండి.. కారణమేంటి?

By:  Tupaki Desk   |   30 Jun 2020 12:10 PM GMT
కొండపోచమ్మ కాలువకు గండి.. కారణమేంటి?
X
కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి అన్ని దిగ్విజయంగా సాగుతున్నాయి. చివరి ప్రాజెక్టు కొండ పోచమ్మ వరకు కూడా నీళ్లు చేరాయి. తెలంగాణను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టులో తాజాగా అపశృతి చోటుచేసుకుంది.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడింది. నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. పంట పొలాలు నీట మునిగాయి.

జగదేవ్ పూర్, ఆలేరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది. దానికి అనుబంధంగా మిగిలిన కాలువలు, చిన్న చిన్న పనులను ప్రభుత్వం స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించింది.

కొండపోచమ్మ సాగర్ కాలువ పనులను చేపట్టిన స్థానిక కాంట్రాక్టర్ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ కాలువకు గండి పడినట్లుగా చెబుతున్నారు. స్థానిక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కాలువ గండికి కారణమని.. దీంతో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.