Begin typing your search above and press return to search.

కోనసీమ అల్లర్లు వైసీపీ మాస్టర్ ప్లాన్.. జనసేన సంచలన ఆరోపణ

By:  Tupaki Desk   |   29 May 2022 10:11 AM GMT
కోనసీమ అల్లర్లు వైసీపీ మాస్టర్ ప్లాన్.. జనసేన సంచలన ఆరోపణ
X
చలో అమలాపురం కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా చోటు చేసుకున్న విధ్వంసకాండ పెను సంచలనంగా మారటమే కాదు.. ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణమైంది. ఈ అల్లర్లపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ అధికారపక్షం వైసీపీపై సంచలన ఆరోపణలు చేసింది జనసేన.

కోనసీమ అల్లర్లు యాదృచ్చికంగా జరిగినవి కాదని.. రాజకీయ లబ్థి కోసం వైసీపీ గీసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా జరిగాయని ఆరోపించింది. కోనసీమలో ఏర్పడిన ప్రత్యేక రాజకీయ పరిస్థితులతో వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిందన్న జనసేన.

"కాపు, శెట్టిబలిజలతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఒక రాజకీయ సమూహంగా జనసేన వైపు మొగ్గుచూపడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. వైసీపీ పునాదులు కదులుతున్న నేపధ్యంలోనే ఈ అరాచకపు క్రీడకు నాంది పలికింది.

ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో అన్నదమ్ముల్లా ఉండే కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ నాయకులు పన్నిన కుట్ర" అంటూ మండిపడింది.

కోనసీమ ఉదంతంపై ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీస స్పందన లేకపోవటాన్ని జనసేన ప్రస్తావిస్తూ.. "జగన్ రెడ్డి రాజకీయ లబ్ది కోసం ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టించారు. వారి రాజకీయాల కోసం ఎస్సీలు, బీసీలనే బలిచేశారు.

ఈ ఘటనపై ఇంత వరకు ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదు. ఇదొక్కటి చాలు.. ప్రభుత్వం దీన్ని ఎంత తేలిగ్గా తీసుకుందన్న విషయం అర్ధమవుతోంది" అని మండిపడింది. కులాల మధ్య చిచ్చుపెట్టి వారిని విచ్చిన్నం చేయాలన్న ఆలోచనతో కోనసీమ ప్రాంతంలో అల్లర్లు సృష్టించారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. జనసేన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.