Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌ నుంచి కోటి తీసుకున్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ

By:  Tupaki Desk   |   14 Dec 2021 12:30 PM GMT
టీఆర్ఎస్‌ నుంచి కోటి తీసుకున్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ
X
అంతా సద్దుమణిగింది.. తెలంగాణ కాంగ్రెస్ ఒక తాటిపైకి వస్తోంది అనుకుంటున్నతరుణంలో మళ్లీ కుదుపు. ఫైర్ బ్రాండ్ నేతలు, నల్లగొండ సోదరులు, ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల వేర్వేరు సందర్భాల్లో టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉన్న ఫొటోలు కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరి ధర్నాకు కోమటిరెడ్డి హాజరై.. రేవంత్ పక్కనే కూర్చుని సంభాషించారు.

ఇక రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి రేవంత్ హాజరయి కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో అంతా దారికి వస్తుంది అని కార్యకర్తలు భావించారు. ఇలాంటి సమయంలో రెండ్రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ చిచ్చురేపినట్టే కనిపిస్తోంది.
కోమటిరెడ్డి అమ్ముడుపోయారు

నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేశ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన డబ్బులు తీసుకున్నారన్నారని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆయన అనుచరులకు కోటి రూపాయలు అందాయని పేర్కొన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. అయినప్పటికీ ఆరుగురు స్వత్రంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారని స్వత్రంత అభ్యర్థి నగేశ్ అన్నారు.

తాను కాంగ్రెస్‌కు చెందిన జెడ్పీటీసీని అయినా తనకు ఓటు వెయ్యవద్దని కోమటిరెడ్డి ఓటర్లకు చెప్పారని ఆరోపించారు. వెంకట్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారని అన్నారు. ఆయన కారణంగా తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగిందన్నారు.

ఎంపీ కోమటిరెడ్డి నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థికి 26 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. నిజాయతీగా ఉన్న తనకు 226 ఓట్లు వచ్చాయని నగేశ్ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కోమటిరెడ్డికి ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెపుతారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో గెలిచిందని దుయ్యబట్టారు.