Begin typing your search above and press return to search.

తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడం ఎందుకు..?

By:  Tupaki Desk   |   14 Jun 2019 5:30 PM GMT
తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడం ఎందుకు..?
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో కోడెల కుమారుడు, కుమార్తె పలు దందాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ చాలా మంది వారిపై వేరు వేరుగా కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బాధితులంతా బయటకు వచ్చారు. అంతేకాదు, పోలీసులు పిలుపు మేరకు ఇంకా చాలా మంది బాధితులు కేసులు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోడెల కుమారుడు, కుమార్తె కనిపించకుండా పోయారు.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో భూకబ్జాలు, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణలకు దిగడం వంటివి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల కుమారుడు కోడెల శివరామ్‌, విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమపై కేసులు నమోదు కావడంతో పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని భావించిన వారిరువురూ ఎవరికీ కనిపించకుండా పోయారు. అంతేకాదు, పోలీసులు ఫోన్ చేస్తారన్న భయంతో తమ మొబైల్స్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తోంది. వీరి అజ్ఞాతంలో ఉండే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

ఈ పరిణామం తర్వాత కోడెల కుటుంబంపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. వాస్తవానికి తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ‘కే ట్యాక్స్’ పేరుతో కోడెల తనయుడు వసూళ్లకు పాల్పడేవాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో ఇది మీడియాలో రాకుండా జాగ్రత్తలు పడ్డారు. కానీ, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో బాధితులంతా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో వరుస పెట్టి కోడెల కుమారుడు, కుమార్తెపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, కోడెల మాత్రం ఇటీవల దీనిపై భిన్నంగా స్పందించారు.

''నా కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని గతంలోనే స్పష్టం చేశాను. కాని ఇప్పుడు నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తున్నారు. నా కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచిపద్ధతి కాదు. నాపై చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా. పథకం ప్రకారమే నా కుటుంబంపై కేసులు పెడుతున్నారు'' అని కోడెల ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం తమ వాళ్లు తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు అనే విషయం మాత్రం కోడెలకే తెలియాలి.