Begin typing your search above and press return to search.

కోడెల మార్క్ ఆవేదన... ఆయనా ఓ బాధితుడేనట

By:  Tupaki Desk   |   12 Aug 2019 11:12 AM GMT
కోడెల మార్క్ ఆవేదన... ఆయనా ఓ బాధితుడేనట
X
టీడీపీ సీనియర్ నేత- మాజీ మంత్రి, ఏపీ అసెంబ్లీ తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహారం నానాటికీ జఠిలమవుతోంది తప్పించి సద్దుమణగడం లేదు. టీడీపీ అధికారంలో ఉండగా... పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉన్నా కూడా... పార్టీ జెండాలతో కార్యక్రమాలకు హాజరు కావడం, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం కోడెలకు మాత్రమే సాధ్యమైంది. ఓ పక్క స్పీకర్ పదవికి ఉన్న ఇమేజీని డ్యామేజీ చేస్తూ కోడెల వ్యవహరిస్తుంటే... ఆయన పిల్లలు మాత్రం తండ్రి పదవిని అసరా చేసుకుని అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఘోరంగా ఓడిపోగా, కోడెల కూడా చిత్తుగా ఓడిపోవడంతో నాడు వీరి చేతిలో ఇబ్బంది పడ్డ వారంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. మొత్తంగా కోడల ఫ్యామిలీపై ఇప్పుడు ఎక్కడ లేనంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇలాంటి సమయంలో కోడల తనదైన మార్కు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోడెల బాధితులమంటూ వారి చేతిలో నష్టపోయిన వారంత పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటే... కోడెల మాత్రం తానూ బాధితుడినేనంటూ కొత్త వాదన మొదలెట్టేశారు. మొన్న సాయంత్రం కోడెల కుమారుడు శివరాం... గుంటూరులో నిర్వహిస్తున్న హీరో హోండా షోరూంను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో కోడెల కుమారుడు తనదైన శైలిలో స్వైర విహారం చేసి... ప్రభుత్వానికి పన్ను కట్టకుండానే వేలాది బైక్ లను అమ్మేశారట. ఈ తంతు ఏళ్ల తరబడి సాగుతోందట. గడచిన ఐదేళ్లలో అయితే శివరాంకు అడ్డే లేకుండా పోయిందట. ఈ మొత్తం వ్యవహారంపై పక్కా ఆధారాలు సేకరించిన రవాణా శాఖ కోడెల షోరూంను సీజ్ చేసింది. దీనిపై తనదైన శైలి వాదన వినిపించేందుకు మీడియా ముందుకు వచ్చిన కోడెల... సీజ్ చేసే ముందు నోటీసులు ఇవ్వాలన్న విషయం అధికారులకు తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పొద్దంతా ఖాళీగా ఉండి రాత్రి పూట షోరూంను సీజ్ చేయడమేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్న సందర్భాన్ని బేస్ చేసుకుని తన షోరూంను సీజ్ చేశారని ఆయన మండిపడ్డారు.

ఇదంతా బాగానే ఉన్నా... అధికారులు దాడులు చేయడం, అందుబాటులో ఉన్న రికార్డులను సరిచూసుకోవడం, నిబంధనలు ఉల్లంఘనలను నిర్ధారించుకోవడానికి చాలా టైమే పడుతుంది కదా. అవన్నీ పూర్తయ్యాకే షోరూం సీజ్ జరిగి ఉంటుందన్నది కామన్ పీపుల్ మాట. అయితే తన కుమారుడి షోరూం సీజ్ అన్యాయమనో, ఇంకేదనో అనాల్సిన కోడెల... సీజింగ్ టైమింగ్ ను ఆసరా చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తుంటే... ఈ ఆవేదన కొత్త రకం ఆవేదన అనే చెప్పాలి. అంతేకాకుండా ఇన్ని మాటలు మాట్లాడిన కోడెల... తన కుమారుడి షోరూంలో ఎక్కడ చిన్న అవినీతి, అక్రమాలు జరగలేదన్న మాటను ఎందుకు గట్టిగా వినిపించలేకపోయారన్న మాట ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతటితో ఆగని కోడెల... రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు తెగబడుతోందని, ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న తనపై ప్రత్యక్ష్యంగా దాడులు జరగకపోయినా... తానూ ఓ బాధితుడినేనంటూ కోడెల తనదైన మార్కు కన్ క్లూజన్ ఇవ్వడం చూస్తుంటే... కోడెల రూటే సపరేటు అని చెప్పక తప్పదు.