Begin typing your search above and press return to search.

గేల్ వీర విధ్వంసం.. పంజాబ్ గ్రాండ్ విక్టరీ

By:  Tupaki Desk   |   27 Oct 2020 9:45 AM IST
గేల్ వీర  విధ్వంసం.. పంజాబ్ గ్రాండ్  విక్టరీ
X
ఐపీఎల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో అద్భుతంగా ఆడుతూ రేస్ లో నిలుస్తోంది. సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ మరో సారి పంజా విసిరి ఘన విజయం సాధించింది.వరుసగా ఐదో విజయం సాధించిన పంజాబ్‌.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. బంతిలో బౌలర్లు నైట్ రైడర్స్ జట్టుని కట్టడి చేయగా మన్‌దీప్, గేల్‌ అర్ధ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా జట్టులో ఓపెనర్ శుభ్ మన్‌ గిల్‌ (57) అర్ధ శతకం చేయగా కెప్టెన్‌ మోర్గాన్‌ (40) ఆదుకున్నాడు. ఓపెనర్‌ నితీష్‌ రాణాను మ్యాక్స్‌వెల్‌ డక్ ఔట్ చేశాడు. రాహుల్‌ త్రిపాఠి (7), దినేష్‌ కార్తీక్‌ (0) షమీ బౌలింగ్ లో ఔట్ అయ్యారు.నరైన్‌ (6)ను జోర్డాన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆఖర్లో ఫెర్గూసన్‌ (24 నాటౌట్‌) ధాటిగా ఆడడంతో కోల్ కతా 149 పరుగులు చేయగలిగింది.

ఛేదనలో పంజాబ్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ అందుకుంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (28), మన్‌దీప్ 47 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రాహుల్ ఔట్ అయినా మన్ దీప్ (56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్‌), చక్కటి అర్ధ సెంచరీ సాధించాడు. క్రిస్ గేల్ (29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 51) తన స్టయిల్లో సిక్సులతో చెలరేగి ఆడి జట్టుకు గెలుపు అందించాడు. గేల్‌ కే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

షమీ సూపర్ బౌలింగ్

పంజాబ్ బౌలర్లలో షమి (3/35) అద్భుత బౌలింగ్ తో కోల్ కతా పని పట్టాడు. అర్ధ సెంచరీతో జోరు మీద ఉన్న శుభ్ మన్ గిల్ ని ఔట్ చేసిన షమీ ఆ తర్వాత త్రిపాఠిని సాగనంపాడు. దినేష్ కార్తీక్ ని డక్ఔట్ చేశాడు. బిష్ణోయ్‌ (2/20), జోర్డాన్‌ (2/25) వికెట్ల తో ఆకట్టుకున్నారు.