Begin typing your search above and press return to search.

మోడీని.. కేసీఆర్ కు భలేగా పోలిక పెట్టేసిన కిషన్ రెడ్డి

By:  Tupaki Desk   |   22 Aug 2021 9:35 AM IST
మోడీని.. కేసీఆర్ కు భలేగా పోలిక పెట్టేసిన కిషన్ రెడ్డి
X
ఏమైందో ఎవరికి తెలీదు. ఒకప్పుడు నిప్పులు చెరిగే కిషన్ రెడ్డి..కొన్నేళ్లుగా ఆచితూచి అన్నట్లు మాట్లాడటం కనిపిస్తుంది. కిషన్ రెడ్డికి విపక్షంలోకూర్చోవటం కొత్తేం కాదు. ఆ సందర్భంలో అధికారపక్ష నేతలపై విరుచుకుపడుతుంటారు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని తరచూ తీవ్రస్థాయిలో మండిపడేవారు. ఘాటు విమర్శలు చేసేవారు. ఆ తర్వాత కేసీఆర్ విషయంలోనూ ఆయన తీరు అలానే ఉండేది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాస్త ముందు నుంచి ఆయన మాటలోనే.. ఆయన తీరులోనూ మార్పు వచ్చిందని చెబుతారు. మాటలతో తూటాలు పేల్చే ఆయన.. అందుకు భిన్నంగా వ్యవహరించటం చాలామంది జీర్ణించుకోలేకపోయేవారు. ఎందుకిలా? అన్న ప్రశ్నే తప్పించి.. దానికి సమాధానం లభించేది కాదు.

అలాంటి కిషన్ రెడ్డి తాజాగా కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన చేపట్టిన నాలుగు రోజుల జన అశీర్వాద యాత్ర ముగింపు రోజుసందర్భంగా సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడేళ్లలో ఏ రోజు సెలవు తీసుకోకుండా పని చేశారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏడేళ్ల పాలనతో ఎప్పుడూసెక్రటేరియట్ కు రాలేదన్నారు. 'ఫాంహౌస్.. ప్రగతిభవన్ లకు ఆయన పరిమితమయ్యారు. సెక్రటేరియట్ కు రావటం లేదని ప్రశ్నిస్తే.. దాన్ని కూల్చివేసి ఎవరూ ప్రశ్నించకుండా చేశారు. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఎక్కడ కూర్చుంటారోకూడా తెలీని పరిస్థితిని తెచ్చారు'' అని మండిపడ్డారు.

సీఎం పదవి తనకు చెప్పుతో సమానమన్న కేసీఆర్.. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని అవమానించారని.. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించిన కిషన్ రెడ్డి.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేటలో ఏర్పాటు చేసిన సభలో మాత్రం ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంబర్ పేటకు వస్తే.. చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లుగా ఉందన్నారు. ఢిల్లీలో తాను ఉన్నానంటే దానికి కారణం అంబర్ పేట ప్రజలు.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలేనని చెప్పారు.

కేంద్రమంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని.. అంబర్ పేటకు దూరమయ్యాననే బాధ ఉందని.. అంబర్ పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానన్నారు. అంబర్ పేట తనకు తల్లిలాంటిదని.. పార్టీ.. అంబర్ పేట ప్రజలు తనకు రెండు కళ్లతో సమానమన్నారు. ఈ మధ్య కాలం వరకు ముఖ్యమంత్రికేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయని కిషన్ రెడ్డి.. అందుకు భిన్నంగా ఆయన గళం విప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. దీనికి గులాబీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.