Begin typing your search above and press return to search.

బాబుది ఓ ఓట‌మి ప్ర‌య‌త్నం..మాజీ సీఎం కామెంట్‌

By:  Tupaki Desk   |   20 Dec 2018 7:19 PM IST
బాబుది ఓ ఓట‌మి ప్ర‌య‌త్నం..మాజీ సీఎం కామెంట్‌
X
మాజీ ముఖ్యమంత్రి - సుదీర్ఘ‌కాలం త‌ర్వాత తిరిగి క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కాంగ్రెస్ నేత కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో రాజ‌కీయాల‌కు బైబై చెప్పిన ఆయ‌న ఇటీవ‌ల తిరిగి త‌న సొంత గూడు అయిన కాంగ్రెస్ లో చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో చేరిన‌ప్ప‌టికీ - క్రియాశీల కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న కిర‌ణ్‌ కుమార్ రెడ్డి తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరును త‌ప్పుపట్టారు. బీజేపీతో దోస్తీకి చంద్ర‌బాబు నాయుడు గుడ్ బై చెప్పేయ‌డం గురించి వివ‌రిస్తూ ప్ర‌త్యేక హోదా పేరుతో చంద్ర‌బాబు విఫ‌ల‌య‌త్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

నాలుగేళ్ల పాటు బీజేపీతో దోస్తీ చేసి - కేంద్ర ప్ర‌భుత్వంలో కొన‌సాగిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా పేరుతో ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం ఏమీ ఉండ‌ద‌ని కిర‌ణ్‌ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా విష‌యంలో చంద్ర‌బాబు నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే - ఆయ‌న కేంద్రంలో తాము మ‌ద్ద‌తిచ్చిన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలోనే ఒత్తిడి చేసి ఉండాల్సింద‌ని అన్నారు. కానీ నాలుగేళ్ల త‌ర్వాత ఆందోళ‌న చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం ఏం ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎన్నికల ముందు మోడీ - చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముందు ఎన్డీఏతో చేతులు కలిపి ఆ తరువాత టీడీపీ బయటకు వచ్చిందని.. ఆ విషయంలో చంద్రబాబుదీ తప్పుందని చెప్పారు. కేంద్రంతో కలిసుండీ.. విభజన హామీలు సాధించుకోకపోతే ఫెయిల్యూర్ కాదా.. అని ప్రశ్నించారు. ముందే ఎన్డీఏ నుంచి వైదొలిగితే కేంద్రంపై ఒత్తిడి వచ్చేదని కిర‌ణ్‌ కుమార్ రెడ్డి అన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఏపీ సీఎం చంద్ర‌బాబు మైత్రిపై తనకూ ఆశ్చర్యంగానే ఉందని కిర‌ణ్‌ కుమార్ రెడ్డి చెప్పారు. యూపీఏ వచ్చి రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా సహా.. విభజన హామీలు నెరవేరతాయన్న నమ్మకంతోనే చంద్రబాబు.. రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. బీజేపీ అన్ని విధాలుగా ఫెయిలైందన్న కిరణ్‌.. విభజన హామీలు నెరవేరాలంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కవాలన్నారు. కాంగ్రెస్‌ ను వీడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదని.. పరిస్థితుల ప్రభావం వల్లే అలా జరిగిందని మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత జగన్‌ పై కూడా కిర‌ణ్‌ కుమార్ రెడ్డి స్పందించారు. జ‌గ‌న్ ఎన్ని రోజులు.. ఎందుకు నడుస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మెడలు వంచడం, పోరాటాలు చేయడంలో వైసీపీ విఫలమైందన్నారు.