Begin typing your search above and press return to search.

కరోనా కట్టడికి కిమ్​ రాక్షస నిర్ణయాలు.. ఇద్దరి ఉరితీత

By:  Tupaki Desk   |   28 Nov 2020 2:20 PM IST
కరోనా కట్టడికి కిమ్​ రాక్షస నిర్ణయాలు.. ఇద్దరి ఉరితీత
X

ప్రస్తుత ప్రజాస్వామ్యయుగంలో నియంతృత్వానికి.. పాసిజానికి మారు పేరు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​. అతడు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. కాదని ఎవరైనా తిరగబడితే వాడి జీవితానికి అదే ఆఖరిరోజు అవుతుంది. దేశ ఆర్థికపరిస్థితి బాగుచేయడానికైనా.. కరోనా కట్టడికైనా అతడి నిర్ణయాలు చాలా రాక్షసంగా ఉంటాయి. విపత్తును ఎదుర్కొనేందుకు అతడు అవలంభించే స్కీమ్స్​ ఎంతో కఠినంగా ఉంటాయి. దేశ ఆర్థికస్థితి బాగుపడటం కోసం.. మెజార్టీ ప్రజల బాగుకోసం ఓ పదిమంది ప్రాణాలు తీయడానికి అతడు వెనకాడడు. ఈ నయా హిట్లర్​, ఆధునిక నాజీ పేరు చెబితే ఉత్తరకొరియా ప్రజలే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలు సైతం వణికిపోతాయి. అగ్రరాజ్యం అమెరికాతో సైతం కయ్యానికి సై అంటాడు. అంతలోనే అమెరికా అధ్యక్షుడితో కాఫీ తాగి షాకిస్తాడు. అతడి అంచనాలు, ఆలోచనలు రాజకీయ దురంధరులకే అందవు.

ఇటీవల కరోనా లాక్​డౌన్​ ఉల్లంఘించిన ఓ ఇద్దరిని కిమ్​ ప్రభుత్వం ఉరి తీయించినట్టు సమాచారం. దక్షిణ కొరియాకు చెందిన ఓ సీక్రెట్ ఏజెన్సీ ఇందుకు సంబంధించిన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఉత్తరకొరియా ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కానీ ఆ విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నది. మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకుంటున్నది. దీంతో దేశ ఆర్థికపరిస్థితిని మెరుగపరిచేందుకు కిమ్​ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే కరోనా వ్యాక్సిన్​ కోసం ఉత్తరకొరియా దొడ్డి దారిని అవలంభిస్తున్నది. ఇతర దేశాల ఫార్మాకంపెనీ డాటాను హైజాక్​ చేసి వ్యాక్సిన్​ తయారు చేయాలని చూస్తున్నది. సౌత్​ కొరియాకు చెందిన ఓ కంపెనీ డాటాను ఉత్తరకొరియా హ్యాక్​ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉత్తరకొరియా రాజధాని ప్యోంగ్యాంగ్​తో పాటు ఉత్తర జంగ్​గ్యాంగ్​లో ప్రస్తుతం లాక్​డౌన్​ కఠినంగా అమలవుతున్నది. ఆంక్షల్ని ఉల్లంఘించిన ఇద్దరికి మరణశిక్ష విధించారని సమాచారం.

ఇటీవల ఓ అధికారి విదేశాల నుంచి రహస్యంగా సరుకులు తెచ్చుకున్నాడట. విషయం తెలిసిన ప్రభుత్వం అతడికి ఉరిశిక్ష విధించింది. మరో అధికారిని కూడా ఉరితీయించినట్టు సమాచారం. సముద్ర నీటితో కరోనా వస్తుందేమోనన్న భయంతో అక్కడ చేపలవేటను నిషేధించారు. సముద్రం చుట్టుపక్కలకు ఎవరైనా వెళితే కాల్చిచంపేస్తామని అధికారులు హెచ్చరించారట. దేశ ఆర్థికపరిస్థితిని గాడిలో పెట్టాలని కిమ్​ అధికారులను ఆదేశించాడట. ఇటీవల ముఖ్య అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని సూచించాడట. అయితే అమెరికాలో అధికార మార్పిడిపై ఇంతవరకు ఉత్తరకొరియా స్పందించలేదు. కొత్త అధ్యక్షుడు జో బైడెన్​తో కిమ్​ స్నేహ హస్తం చాచుతాడా? లేదంటే మునిపటి లాగానే కయ్యానికి కాలుదువ్వుతాడా అన్నది వేచి చూడాలి.