Begin typing your search above and press return to search.

ఆ ప్రోగ్రాంకు హాజరై సర్ ప్రైజ్ ఇచ్చిన కిమ్.. వెంట ఎవరున్నారంటే?

By:  Tupaki Desk   |   2 May 2020 9:15 AM IST
ఆ ప్రోగ్రాంకు హాజరై సర్ ప్రైజ్ ఇచ్చిన కిమ్.. వెంట ఎవరున్నారంటే?
X
తన తీరుతో అదే పనిగా ప్రపంచానికి సర్ ప్రైజ్ లు ఇవ్వటం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు అలవాటే. ఇటీవల కాలంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆయన బయటకు రావటం లేదని కొందరు. అదేం లేదు.. కిమ్ ఇక లేనట్లే.. ఎందుకంటే ఆయన కోమాలో ఉన్నాడని కొందరి నోట అదే పనిగా రావటం తెలిసిందే. ఇలాంటి వాదనలకు బలం చేకూరేలా చైనా నుంచి ప్రత్యేక వైద్యుల టీం ఒకటి ఉత్తర కొరియాకు వెళ్లిందన్న మాటలతో కిమ్ కు ఏదో జరిగి పోయిందన్న వార్తలు అదే పనిగా వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచంలోని ఏ మూలన ఏం జరిగినా డేగకన్నుతో చూసే అగ్రరాజ్యం.. కిమ్ విషయంలో పెద్దగా రియాక్టు అయ్యింది లేదు. ఎలాంటి విషయాన్ని అయినా అదే పనిగా మాట్లాడే ట్రంప్.. తన తీరుకు భిన్నంగా కిమ్ ఉదంతంలో మాత్రం ఆచితూచి అన్నట్లు రియాక్టు అయ్యారే కానీ నోరు పారేసుకోలేదు. ఇలాంటివేళ.. ఊహించిన విధంగా సర్ ప్రైజ్ ఇచ్చారు కిమ్. ఏప్రిల్ 11 నుంచి కనిపించకుండా పోయిన ఆయన ఏప్రిల్ 15న జరిగిన తన తాత 108వ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదు.

దీంతో.. ఆయనకు ఏదో జరిగిందన్న వార్తలు జోరందుకున్నాయి. తాజాగా అలాంటి వాటికి పుల్ స్టాప్ పెడుతూ.. ఒక ఎరువుల కంపెనీని తాజాగా ఆయన సందర్శించినట్లుగా ఉత్తర కొరియా మీడియా తెలిపింది. ఈ కార్యక్రమానికి కిమ్ వెంట.. ఆయన్ను నీడలా వెంటాడే అధ్యక్షుల వారి సోదరి కిమ్ యో జోంగ్ కూడా హాజరైనట్లుగా చెబుతున్నారు.

ఈ కార్యక్రమానికి కిమ్ హాజరు కావటంతో అక్కడి వారు ఆశ్చర్యానికి గురైనట్లుగా ఉత్తరకొరియా అధికార మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. అయితే.. ఈ వార్తల మీద అంతర్జాతీయ మీడియా మాత్రం స్పందించకపోవటం గమనార్హం. ఏమైనా.. తనకేం కాలేదన్న విషయాన్ని కిమ్ స్పష్టం చేసినట్లు చెప్పాలి. మరి.. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు రాలేదు. అది కూడా వచ్చేస్తే మరింత బాగుండేది కదా?