Begin typing your search above and press return to search.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కిడ్నాప్ ఆరోపణలు

By:  Tupaki Desk   |   7 Oct 2020 9:45 AM IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కిడ్నాప్ ఆరోపణలు
X
లాక్ డౌన్ వేళ హైదరాబాద్ మహానగరంలో నేరాల తీవ్రత భారీగా తగ్గటం తెలిసిందే. లాక్ డౌన్ మినహాయింపులు మొదలైన నాటి నుంచి పెద్ద ఎత్తున నేరాలు.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మాదాపూర్ లో చోటు చేసుకున్న కిడ్నాప్ ఉదంతం ఒక కొలిక్కిరాగా.. తాజాగా బంజారాహిల్స్ లో కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్ నేత కొడుకు.. అతని అనుచరులు వీరంగం వేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి కంప్లైంట్ ఒకటి తాజాగా పోలీసులకు చేరినట్లుగా తెలుస్తోంది.

శివగణేశ్ అనే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసినట్లుగా చెబుతున్నారు. తుపాకులు.. కత్తులు చూపించి మరీ కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు కొండారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కంప్లైంట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఆయనకు శామీర్ పేట.. కడప జిల్లాల్లో భూములు ఉన్నాయి. వీటికి సంబంధించి తనను బెదిరించి..కిడ్నాప్ చేసి ఆస్తుల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. తమకు అందించిన కంప్లైంట్ ఆధారంగా కొండారెడ్డి.. ఆయన అనుచరుల మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఉదంతంపై తాజాగా విచారణ జరుపుతున్నారు.