Begin typing your search above and press return to search.

ప్రముఖ చానల్ తో ఈటెల కీలక వ్యాఖ్యలు.. ‘మంత్రిగా కాదు మనిషిగా కూడా చూడలేదు’

By:  Tupaki Desk   |   2 May 2021 5:30 AM GMT
ప్రముఖ చానల్ తో ఈటెల కీలక వ్యాఖ్యలు.. ‘మంత్రిగా కాదు మనిషిగా కూడా చూడలేదు’
X
ఊహించని రీతిలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోవటం.. వైద్య సుదుపాయాలు.. అత్యవసర వైద్యం అందక పలువురు మరణిస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. అధికార పక్షానికి చెందిన కీలక నేత.. వైద్యఆరోగ్య మంత్రిగావ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావటం.. దానిపై ప్రభుత్వం రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిన వైనం షాకింగ్ గా మారింది.

ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగా కరోనాను పక్కన పెట్టేసి మరీ.. ఈ రాజకీయ అంశంపై ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రిత్వ శాఖ నుంచి పక్కకు తప్పించి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటల భూకబ్జాలపై అధికారులు ఇచ్చే నివేదికను అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి వేళ.. కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయంపై అందరికి స్పష్టత వచ్చేస్తోంది.

ఇలాంటి వేళ ఒక ప్రముఖ చానల్ తో మంత్రి ఈటల ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటివరకు ఆచితూచి అన్నట్లుగా మాట్లాడుతున్న ఆయన..కాసింత బరస్ట్ అయ్యారు. తన మీద ఆరోపణలు రావటం.. వాటికి బలం చేకూరేలా కొన్ని చానళ్లలో ప్రత్యేక కథనాలు దంచి కొడుతున్నవేళ..వివరణ ఇచ్చిన ఆయన ఎక్కడా తొందరపాటు వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా కొన్ని కీలక వ్యాఖ్యలు ఈటల నోటి నుంచి వచ్చాయి. అవేమంటే..

- టీఆర్ఎస్‌లో మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనే పరిస్థితులు లేదు. మొత్తం వ్యవహారాలన్నీ డిజైన్డ్‌ బై సీఎం, డిక్టేటెడ్‌ బై సీఎం అన్నట్లుగా ఉంటుంది. సీఎం సర్వం కావచ్చుగాక.. కానీ ఏ శాఖకు సంబంధించిన పథకాలను రూపొందించే క్రమంలో ఆ శాఖ మంత్రిని కూడా దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని మంత్రులు బయటకు చెప్పకపోవచ్చు.

- పథకం ప్రకారమే కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరేం చేయాలో ముందు కొందరు నిర్దేశించారు. దాని ప్రకారమే ఈ తతంగం నడుస్తోంది.
- సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఉన్నట్లుగా లేరని, ముఖ్యంగా రెండోసారి గెలిచాక బంధాలు, ఉద్యమకారులను పక్కనబెట్టారు.
- తప్పు చేస్తే పిలిచి మందలించాల్సింది. ఇలాంటి ఆరోపణలు చేయడం నా వ్యక్తిత్వాన్ని చంపడమే.
- శపించేందుకు రుషిని కాదు. ఎవరి పాపం వారికే తగులుతుంది. నేనెలాంటి తప్పు చేయలేదు. సిట్టింగ్‌ జడ్జి లేదా అన్ని దర్యాప్తు సంస్థలతో విచారణకు నేను సిద్ధం.
- అసైన్డ్‌ భూములు అస్సలు కొనలేదు. మేం స్థాపించాలనుకున్న పరిశ్రమ కోసం టీఎస్ఐఐసీని ఆశ్రయించాం. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను గుర్తించాం. వాటిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే మాకు కేటాయిస్తామన్నారు. అదింకా ప్రాసెస్‌లోనే ఉంది. అంతే తప్ప కబ్జా పెట్టాననడం సమంజసం కాదు.
- సీఎం కేసీఆర్ ను చివరిసారిగా గత అసెంబ్లీ సమావేశాల్లోనే కలిశా. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంలో మరోసారి కలిశాం. ఈ వ్యవహారం తరువాత ఆయన్ని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా కరోనా కారణంగా ఆయన అందుబాటులోకి రాలేదు.
- ఉద్యమంలో అంతా కలసి పనిచేసినం. ప్రభుత్వం వచ్చాక అంతా గమ్మత్తు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమం, సహచరులు అన్న భావనలను సీఎం కొట్టిపారేసిండు. రొటీన్‌ రాజకీయ పార్టీలా మార్చిండు.
- రెండోసారి గెలిచాక ఉద్యమాలు, ఉద్యమకారులు, ఈ బంధాలు అక్కర్లేదు అన్న భావనకు సీఎం వచ్చారు.
- రెండోసారి గెలిచాక సీఎం ఆలోచనల్లో మార్పు వచ్చింది. మూడు నెలలపాటు కేబినెట్‌ ఏర్పాటు చేయలేదు. దానికి కారణాలు ఆయనకే తెలియాలి. చివరకు నాకు శాఖ ఇవ్వడం కూడా అవమానకరంగా ఇచ్చారు.
- నాపై కొన్ని పత్రికల్లో కథనాలు రాయించారు. ఎక్కడా నన్ను మంత్రిగా, సహచరుడిగా కాదు కదా.. కనీసం మనిషిగా కూడా చూడలేదు. కేబినెట్‌ మినిస్టర్‌కు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
- నిజంగానే ఇలాంటి తప్పులు జరిగితే పిలిచి మందలిచొచ్చు కదా.. అడగొచ్చు కదా.. ఒక్కనాడూ మాట్లాడకుండా టీవీలల్ల వేసి బద్‌నాం చేయడం ఎంత వరకు సమంజసం? మా ముఖ్యమంత్రికి తెలియకుండా చీమ చిటుక్కుమంటదా మా ప్రభుత్వంలో? మంత్రులు అక్రమాలు చేసే ఆస్కారం ఉంటదా? అంత ధైర్యం చేస్తారా?