Begin typing your search above and press return to search.

త‌ప్పు కేశినేనిది...బ‌ల‌య్యేది ఏపీ ప్ర‌జ‌లు!

By:  Tupaki Desk   |   14 April 2017 5:44 AM GMT
త‌ప్పు కేశినేనిది...బ‌ల‌య్యేది ఏపీ ప్ర‌జ‌లు!
X
ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకోనున్న ఓ నిర్ణ‌యంపై ఇప్పుడంతా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో, దూకుడు వ్య‌క్తిత్వంతో కొంప‌కొల్లేరు అయిపోయింది అధికార పార్టీ నాయ‌కుడు అయితే....స‌ద‌రు న‌ష్టాన్ని సామాన్యుల‌పై మోపేందుకు టీడీపీ స‌ర్కారు సిద్ధ‌మ‌యింద‌ని తెలుస్తోంది. ఇదంతా విజయవాడ ఎంపి - కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని గురించి! త్వ‌ర‌లో ఆయ‌న బ‌స్సుల‌ను ఆర్టీసీకి అంట‌గట్ట‌నున్నారనే వార్త గురించి!

ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం - ఆయన గన్‌ మెన్‌ పై దాడి ఘటనతో తెరపైకి వచ్చిన కేశినేని నాని వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పించడంతో తెరపడిందని చాలామంది భావించారు. అయితే, ప్రస్తుతం కేశినేని నిలిపివేసిన బస్సుల్లో కండిషన్‌ లో ఉన్న సుమారు 100 బస్సులను ఆర్టీసి అద్దె ప్రాతిపదిక తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తాజాగా కేశినేని ట్రావెల్స్ మూత వెనుక మరో కోణాన్ని ఆవిష్కరించడం చర్చనీయాంశమయింది. ఆయన తన బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగవేసేందుకే మూత నాటకం ఆడారని, ఇప్పటికే కేశినేని ట్రావెల్స్ 2013 నుంచి బ్యాంకులకు రుణాలు చెల్లించడం లేదని చెవిరెడ్డి బయటపెట్టారు. గత 8 నెలల నుంచి సంస్థలో పనిచేస్తున్న 1080 మంది సిబ్బందికి జీతాలు - పీఎఫ్ - ఇఎస్‌ ఐ చెల్లించడం లేదని వెల్లడించారు. బకాయిలు అడిగినందుకు హిందుజా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులపై దాడి చేశారని గుర్తు చేశారు. కాగా, తమ వేతన బకాయిలు చెల్లించాలంటూ రాష్టవ్య్రాప్తంగా పనిచేస్తున్న కేశినేని ట్రావెల్స్ కార్మికులు తాజాగా ట్రావెల్స్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. పిఎఫ్ - ఇఎస్‌ ఐ చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ జరిపిన రాయబారం కూడా ఫలించలేదు. తాము నేరుగా నానితోనే మాట్లాడతామని భీష్మించారు. దానితో దిగివచ్చిన సంస్థ ప్రతినిధులు 15న బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా, 15వ తేదీలోగా తమ బకాయిలు ఇవ్వకపోతే 17న కేశినేని కార్యాలయం వద్ద కుటుంబాలతో సహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

అదే సమయంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ట్రావెల్స్‌ ను మూసివేసి, ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే కుట్ర జరుగుతోందని బాంబు పేల్చారు. దానితో ఇప్పటివరకూ కేశినేని కేవలం అనవసర ప్రతిష్ఠకు వెళ్లి బస్సులు మూసివేశారని కొందరు, బాబు తనతో కమిషనర్‌ కు క్షమాపణ చెప్పినందుకు మనస్తాపం చెంది మూసివేశారని ఇంకొన్ని వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఆర్టీసికి అద్దెకిచ్చే వ్యూహం దాగుందని బయటకు పొక్కడంతో కేశినేని కథ కొత్త మలుపు తిరిగినట్టయింది. అదే జరిగితే ఆర్టీసి సంస్థ అద్దెబస్సులను భరించే స్థాయిలో లేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. 6 నెలల క్రితం వరకూ ఆర్టీసీలో అద్దె బస్సులు లేవు. అయితే తర్వాత 21 ఇంద్ర బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాతిపదికన కేశినేని ట్రావెల్స్‌కు చెందిన సుమారు 100 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. సీఎంఓ కూడా ఆ మేరకు తన పని తాను చేసుకుపోతోందంటున్నారు. ఇప్పటికే 11865 బస్సులున్న ఆర్టీసికి నిర్వహణ - కొనుగోలు భారంగా మారాయని, మళ్లీ ఇప్పుడు 100 అద్దె బస్సులు తీసుకోవడమంటే ఆర్టీసిని దివాళా తీయించడమేనంటున్నారు. అద్దె బస్సులను అడ్డుకుంటామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ఇలా తీసుకునే అద్దె బ‌స్సుల న‌ష్టాన్ని భ‌రించేందుకు సామాన్యుల‌పై భారం మోప‌క త‌ప్ప‌ద‌ని వారు చెప్తున్నారు. త‌ప్పిదం అధికార పార్టీ నేత‌ల‌ది అయితే...దాని ఫ‌లితం అంద‌రూ భ‌రించాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మండిప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/