Begin typing your search above and press return to search.

ఐపీఎస్ అధికారిపై టీడీపీ నేతల ఆగడం

By:  Tupaki Desk   |   26 March 2017 7:52 AM GMT
ఐపీఎస్ అధికారిపై టీడీపీ నేతల ఆగడం
X
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఉదంతం మర్చిపోకముందే ఏపీలోనూ ఓ ఎంపీ అధికారులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. సీనియర్ ఐపీఎస్ అధికారిని నోటికొచ్చినట్లు తిట్టడం చర్చనీయంగా మారింది.

ప్రయివేటు బస్సులకు అడ్డగోలుగా రవాణాశాఖ అధికారులు పర్మిట్లు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తూ రవాణాశాఖ కమిషనర్ - సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యంతో ఎంపి కేశినేని నాని వాగ్వాదానికి దిగడం.. ఆయన్ను దారుణంగా అవమానించడం ఇప్పుడు చినికి చినికి గాలి వానగా మారింది.

తొలుత శనివారం మధ్యాహ్నం టిఎన్‌ టియుసి నేతలు బందరు రోడ్డులోని ఉప రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో డిటిసి మీరాప్రసాద్‌ ను కలిశారు. అనుమతులు లేని బస్సులు తిరుగుతున్నాయని, ప్రైవేటు ట్రావెల్స్‌కు అడ్డదిడ్డంగా పర్మిట్లు ఇస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి డిటిసి కార్యాలయానికి వచ్చారు. అయితే సిబ్బంది టిఎన్‌ టియుసి నేతలను బయటకు వెళ్లమని చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై డిటిసి నుండి సరైన సమాధానం రాలేదని పార్టీ శ్రేణులు ఎంపి కేశినేని నానికి సమాచారాన్ని అందించడంతో హుటాహుటిన డిటిసి కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపి కార్యాలయానికి వస్తున్నారనే సమాచారంతో డిటిసి అక్కడ నుండి వెళ్లిపోతుండగా ఎంపి రోడ్డుపైనే ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపితోపాటు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు - పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌ మీరా తదితరులు ఉన్నారు. ఆర్టీఏ కమిషనర్‌ పై టిడిపి ప్రజాప్రతినిధుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ... రవాణ శాఖ సిబ్బంది సోమవారం ఆందోళనలకు పిలుపునిచ్చారు.

డిటిసి ఆఫీస్‌ లోకి వెళ్లేందుకు బోండా ఉమా యత్నించగా.. ఆర్‌టిఎ హోంగార్డు నివారించారు. దీంతో బోండా ఉమా ఆగ్రహంతో హోంగార్డును నెట్టారు. హోంగార్డు చేసేదేమీ లేక నిస్సహాయంగా ఉండిపోయాడు. మీడియాలో ఈ వార్త హల్‌ చల్‌ చేయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. చర్చల నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న - నగర మేయరు కోనేరు శ్రీధర్‌ - ఉప మేయరు గోగుల రమణారావుతో పాటు పలువురు టిడిపి నేతలు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని మరో విడత హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు.

కాగా కేశినేని నాని దురుసుగా మాట్లాడారని అక్కడున్నవారంతా చెబుతున్నారు. ‘నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపిస్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా’ అంటూ కమిషనర్ పై ఆయన విరుచుకుపడ్డారని చెబుతున్నారు. అంతేకాదు... ‘ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది?’ అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా కమిషనర్‌ను నానా మాటలు అన్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

అసలు కథేంటి..

ఆరెంజ్‌ ట్రావెల్స్‌ కు చెందిన ఓ బస్సు విజయవాడ ఆటోనగర్‌ వద్ద ఈ నెల 22న ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. దీంతో ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సును పోలీసులు సీజ్‌ చేసి విచారణ కోసం విజయవాడ రవాణాశాఖ ఉప కమిషనర్‌(డీటీసీ) కార్యాలయానికి పంపారు. రవాణా శాఖ అధికారులు ఆ బస్సు కండిషన్‌ ను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ ఫైలును పరిశీలించేందుకు రవాణా శాఖ కమిషనర్‌ శనివారం విజయ వాడ బందరురోడ్డులోని డీటీసీ కార్యాలయానికి వచ్చారు. ఇంతలో కేశినేని ట్రావెల్స్ అధినేత అయిన ఎంపీ కేశినేని నాని మనుషులు రంగ ప్రవేశం చేశారు. ఆయన ప్రధాన అనుచరుడు పట్టాభి వచ్చి ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సుపై నివేదికను తాము చెప్పినట్లు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్పటికే దాదాపు తయారైన నివేదికను మార్చి వేసి తాము సూచించినట్లు తయారు చేయాలని కేశినేని ఆదేశించారని కూడా పట్టాభి చెప్పినట్లు సమాచారం. అందుకు కమిషనర్ అభ్యంతరం చెప్పడంతో కేశినేని నాని 200 మందిని వెంటేసుకుని వచ్చి నానా హంగామా చేసినట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/