Begin typing your search above and press return to search.

బాబు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టిన కేఈ

By:  Tupaki Desk   |   7 March 2017 6:19 AM GMT
బాబు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టిన కేఈ
X
చంద్రబాబు నోరున్నవాళ్లకు భయపడి పదవులు పంపిణీ చేస్తున్నారని.. పార్టీ కోసం కష్టపడేవారికి మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని సీనియర్లలో అసంతృప్తి తీవ్రమవుతోంది. తాజాగా తమ కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ పదవులు ఆశించిన భంగపడిన సీనియర్లు మండిపడుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అయితే ఏకంగా తన మనసులోని బాధను ఓపెన్ గా చెప్పేశారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మీడియా ప్రతినిధుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరును ప్రశ్నించారు. చాలాకాలంగా తన తమ్ముడు కేఈ ప్రభాకర్‌ కు ఎమ్మెల్సీ ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. ఈసారి కూడా మొండిచేయి చూపించారని మండిపడ్డారు. అదే జేసీ కుటుంబం నుంచి ముగ్గురు పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన చంద్రబాబు... తన కుటుంబానికి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు. తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో కోరుతున్నా... చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి, తన తమ్ముడికి సమాధానం చెప్పుకోలేక పోతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో రాయలసీమ నుంచి ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదని అన్నారు. కర్నూలు ఎంపీ టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే... ఇక్కడ టీడీపీ గెలుస్తుందని కేఈ చెప్పారు. కర్నూలు ఎంపీ సీటు తన కుటుంబానికి ఇస్తేనే అక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పారు. లేకుంటే కర్నూలులో టీడీపీ గెలుపు సాధ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఈ కృష్ణమూర్తి. కేఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/