Begin typing your search above and press return to search.

హిజాబ్ ర‌చ్చలోకి హైద‌రాబాద్‌ను లాగిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   13 Feb 2022 2:30 AM GMT
హిజాబ్ ర‌చ్చలోకి హైద‌రాబాద్‌ను లాగిన కేసీఆర్‌
X
క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న హిజాబ్ ర‌చ్చ‌పై ఆ రాష్ట్రంలోని పార్టీల నేత‌లే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఉన్న నాయ‌కులు సైతం స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు సైతం ఈ వివాదంపై రియాక్ట‌వుతున్నారు. అయితే, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఈ వివాదంపై స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఏర్పాటుచేసిన‌ టీఆర్ఎస్‌ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారుపై ధ్వజమెత్తారు. ఈ క్ర‌మంలో హిజాబ్ వివాదంపై రియాక్ట‌య్యారు.

క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతుందో చూస్తున్నామ‌ని కేసీఆర్ అన్నారు. ‘ఇవాళ ఐటీ రంగంలో భారతదేశానికి సిలికాన్‌ వ్యాలీ బెంగళూరు సిటీని క‌లిగి ఉన్న‌ కర్నాటక రాష్ట్రం. దాని తర్వాత స్థానంలో ఉంది హైదరాబాద్‌ సిటీ. కర్నాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నారు.. ఆడ పిల్లలు, మన బిడ్డల మీద రాక్షసుల్లా ప్రవర్తించవచ్చునా? ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరును మతపిచ్చి లేపి నేడు కశ్మీర్ లాగా తయారు చేస్తున్నారు. ఇది అవసరమా ఈ దేశానికి?`` అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

దేశంలో ఉండే సహృద్భావ వాతావరణం నాశనమైతే ఎవరు పెట్టుబడులు పెడతారు...ఎవరికి ఉద్యోగాలు వస్తాయి అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. ``ఈ తెలివి తక్కువ బీజేపీ పరిపాలనలో ఇప్పటికే నష్టపోయాం. ఈ పరిపాలన కొనసాగితే.. మతపిచ్చి లేచి.. పొద్దున లేస్తే కర్ఫ్యూ, పోలీస్‌ లాఠీచార్జీలు జ‌రుగుతాయి. ఇవేనా కావాల్సింది దేశానికి?. 140 కోట్ల మంది ఉండే దేశంలో ఈ దిక్కుమాలిన పద్ధతా? మత విద్వేమా? ఎవరి కడుపు నిండుతుంది? దేనికి పనికి వ‌స్తుంది? `` అని కేసీఆర్ విరుచుకుప‌డ్డారు.

``మ‌న‌ పిల్లలకు భవిష్యత్‌ ఉండాలన్నా.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా.. ఈ దేశం ముందుకు వెళ్లాలన్నా కులం, జాతి బేధం లేకుండా ఉండాలి అని కేసీఆ అందరు ముందుకుపోయే దేశాలు లేవా?.. అమెరికాలో 95శాతం క్రైస్తవులు ఉంటారు.. వాళ్లు ఎన్నడూ మతపిచ్చి లేపరు.. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నారు. రాజకీయంగా అర్థం చేసుకొని, స్పందించకపోతే, అవసరమైన తీర్పు ప్రజలు చెప్పకపోతే.. దేశం నాశనమైపోతుంది’ అని వ్యాఖ్యానించారు.