Begin typing your search above and press return to search.

ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తారట కేసీఆర్..ఇలాగేనా?

By:  Tupaki Desk   |   5 Oct 2019 9:20 AM GMT
ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తారట కేసీఆర్..ఇలాగేనా?
X
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె జరుగుతుండడం.. సమ్మె చేసే కార్మికులు - ఉద్యోగులును తొలగిస్తామంటూ శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం గడువు ఇవ్వడంతో తెలంగాణలో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. కార్మికులు కూడా పట్టు విడవకుండా సమ్మెకే సిద్ధమయ్యారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ గతంలో వారినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. గతంలో తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆరెస్ అనుబంధ టీఎంయూ విజయం సాధించినప్పుడు మాట్లాడిన ఆయన ‘ఆర్టీసీ కార్మికుల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసేలా పనిచేయాలి’ అని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

దీంతో కేసీఆర్ విధానమే అంత అని... ఎన్నికల్లో ప్రయోజనాల కోసం తియ్యటి మాటలు చెప్పి అన్ని వర్గాలనూ వాడుకుంటారని, ఆ తరువాత ఇలాగే చేస్తారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమ కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తామన్న కేసీఆరే ఇప్పుడు తమ ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని.. ఎస్మా చట్టం ప్రయోగించి తమను డిస్మిస్ చేస్తామంటున్నారని ఆరోపిస్తున్నారు.

కాగా తెలంగాణలోని ప్రతిపక్షాలు కూడా కార్మికులకే మద్దతుగా నిలిచాయి. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని.. ఆయన కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని అనడం అన్యాయమని అంటున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ముఖ్యమంత్రి కార్మికులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనీ - కార్మికుల న్యాయమైన హక్కులను కాలరాసే విధంగా పాశవికంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ కుమార్ రెడ్డి - పొన్నం ప్రభాకర్ వంటివారు విమర్శించారు.