Begin typing your search above and press return to search.

మేఘా సిగలో కేసీ వ్యాలీ

By:  Tupaki Desk   |   17 Dec 2018 7:00 AM GMT
మేఘా సిగలో కేసీ వ్యాలీ
X
దేశం మొత్తం మీద ప్రత్యేకత సంతరించుకున్న పథకం కేసీ వ్యాలీ (కోరమంగళ- చెళ్లగట్టా వ్యాలీ). ఇది ఓ అరుదైన సాగునీటి పథకం. ఇంతకు ముందెప్పుడూ దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా చేపట్టలేదు. ఓ వైపు నగరంలోని మురుగు - వ్యర్థ (డ్రైనేజి) సమస్యకు పరిష్కారం. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో అంతరించిపోతున్న చిన్న నీటి పారుదల వ్యవస్థకు పునర్జీవం. మురుగు నీటిని శుద్ధి చేసి గ్రామాల్లోని చెరువులకు సాగు నీరిందించి ఆయకట్టును అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ అరుదైన పథకాన్ని బెంగళూరు నగరంలోనూ - సరిహద్దులో ఉన్న కోలార్ - చిక్ బళ్ళాపూర్ జిల్లాలోనూ తాజాగా అములోకి తీసుకొచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)కు దక్కిందని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మోహన్ తెలిపారు. ప్రపంచం మొత్తం మీద నీటిని వృధా కాకుండా శుద్ధి చేసి సూక్ష్మసేధ్యం ద్వారా పంటలు పండిరచే పద్ధతులు ఇజ్రాయిల్ దేశంలోనే ఉన్నాయి. అదే తరహాలో భారతదేశంలో తొలిసారిగా బెంగళూరు నగరంలోని మురికినీటిని శుద్ధిచేసి కోలార్ జిల్లాలోని చెరువులకు అందించేవిధంగా కేసీ వ్యాలీ పథకాన్ని ఎంఈఐఎల్ నిర్మించింది.

దీనివల్ల బెంగళూరు నగరంలో మురుగునీటికి పరిష్కారం లభించింది. పెరిగిపోతున్న నగర జనాభా వల్ల అదే స్థాయిలో మురుగునీటి విడుదల అధికమై ఆ నీటిని ఏం చేయాలనే సమస్య నగరపాలక సంస్థను - ప్రభుత్వాన్ని వేధిస్తుండేది. అదే సమయంలో నగరానికి సమీపంలో ఉన్న కోలార్ జిల్లా తరచుగా వర్షాభావం వల్ల కరువు వాతా పడుతూ రైతులు - గ్రామీణులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రెండింటిని పరిష్కారించాలంటే మురుగునీటిని శుద్ధి చేసి ఆ జిల్లాలోని చెరువులకు సరఫరా చేయడం ద్వారా ఆయకట్టుకు కరువు సంవత్సరాల్లో సైతం నీరందించడం సాధ్యమవుతుందని భావించి అందుకు తగిన విధంగా కేసీ వ్యాలీ పథకాన్ని రూపొందించారు. ఈ పథకాన్ని టెండర్లలో దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ అనేక అవరోధాలు - అవాంతరాలను అధిగమించి గడువుకన్నా ముందే ఈ పథకాన్ని పూర్తిచేయగలిగింది. అయితే ప్రభుత్వం ఈ పథకం క్రింద మరిన్ని అదనపు పనులను అప్పగిస్తుండడంతో ఇంకా పనులు జరుగుతున్నప్పటికి తాజాగా అమలోకి వచ్చింది. బెంగళూరులో శుద్ధి చేసిన నీటిని ప్రస్తుతం పంపింగ్ చేయడం ద్వారా చెరువులకు నీటి సరఫరా ప్రారంభమయ్యింది.

పథకాన్ని ఎంఈఐఎల్ ప్రారంభించడంతో దశలవారిగా 6 క్లష్టర్లలోని 126కు పైగా చెరువులకు నీరిందించాలనే లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం లక్ష్మిసాగర్ - ఉద్దపనహళ్లి - నర్సాపుర - దొడవాళ్ళభి - భత్తన్కేరే - సింగనహళ్లి తదితర చెరువుల వైపు నీరు ప్రవహించడం మొదలైంది. ఈ పథకం క్రింద భూగర్భజలాలు అభివృద్ధి చేయడం ద్వారా ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యం. గత 3 - 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఫలితంగా బావులు - బోర్లు ఎండిపోయాయి. వాటిని పునర్జీవింపచేయడం ద్వారా రైతులు తిరిగి పంటలు పండించుకోవడం సాధ్యమవుతుంది. కరువు నుంచి రైతులను కాపాడే విధంగా శుద్ధి చేసిన బెంగళూరు నగర వ్యర్థ నీరు ఉపయోగపడతాయని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మోహన్ తెలిపారు. .

ఈ తరహా ప్రాజెక్ట్ మొదటిది...

ఈ పథకంలో భాగంగా భూ గురుత్వాకర్షాణకు వ్యతిరేకంగా నీటిని సరఫరా చేయాల్సినందున 6 పంపింగ్ స్టేషన్లను నిర్మించారు. 6 పంపింగ్ స్టేషన్లకు గాను 3 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి నీరందిస్తున్నారు. మిగతా పంపింగ్ స్టేషన్లలో కూడా 90% పని పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1342 కోట్లు. కేసీ వ్యాలీ ప్రాజెక్టుకు విద్యుత్ సమస్య తలెత్తకుండా మేఘా ఇంజనీరింగ్ 6 విద్యుత్ సబ్ స్టేషన్ లను 66 కేవీ విద్యుత్ వినియోగించేలా ఏర్పాటు చేశారు. కేసీ వ్యాలీ ప్రాజెక్ట్ లో భాగంగా 160 నుంచి 2800 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన 23 మోటార్లను ఏర్పాటు చేశారు. నీటి సరఫరాకు 124 కిలోమీటర్ల పొడవున పైపులైన్లను బెంగళూరు నగరం నుంచి నిర్మించారు. 2016 నవంబర్ లో ఈ పని ప్రారంభం కాగా మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసి రెండవ దశ పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 126 కు పైగా చెరువులకు దశల వారిగా నీరందుతుంది.

ఇందుకోసం తాలుక వారిగా చెరువులను క్లష్టర్లుగా విభజించారు. దేశంలో తొలిసారిగా వ్యర్థ జలాలను శుద్ధి చేసి కరువు ప్రాంతానికి నీరందించే ఈ పథకాన్ని కర్నాటక రాష్ట్ర చిన్న నీటిపారుదల - భుగర్భశాఖ రూపొందించాయి. బెంగళూరు నగరంలో కోరమంగళ - చల్లాగట్టా ప్రాంతాల్లో వ్యర్థ జలాలను శుద్ధిచేసే ప్లాంట్లను నిర్మించింది. ఇక్కడ 200 మిలియన్ లీటర్ల రోజుకు శుద్ధి చేయడం ప్రారంభమైంది. అక్కడి నుంచి కోలార్ - చిక్ బళ్లాపూర్ జిల్లాలోని 126 పైగా చెరువులకు ఈ నీటిని సరఫరా చేయడం ప్రారంభమైంది. ఈ పథకాన్ని దశలవారిగా రోజుకు 440 మిలియన్ లీటర్లు శుద్ధి చేసే విధంగా పూర్తిస్థాయిలో నిర్మించేందుకు పనులను కొనసాగిస్తోంది.

బెంగళూరు మెట్రోపాలిటన్ నగరంలోనే అత్యధిక శాతం పనులు చేపట్టవలసి రావడంతో పనులు నిర్వహించడం సవాల్ గా మారింది. రాష్ట్ర - కేంద్ర విభాగాల నుంచి అనేక అనుమతులు సాధించడం - ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో - ఇరుకైన ప్రాంతాల్లో పనులు చేపట్టడం - ప్రైవేటు భూములు - అకాల వర్షాలు కురవడం లాంటి అనేక ప్రతికూలతలను ఎంఈఐఎల్ ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎదుర్కొంది. అవాంతరాలన్నింటినీ విజయవంతంగా అధిగమించిన మేఘా ఇంజనీరింగ్ గడువులోగా పనులను పూర్తిచేసింది.

ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక పైపు...

ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని ఆరు తాలుకాల్లోని చెరువులను నింపుతారు. ఇందుకోసం ఆరు అతిపెద్ద పంప్ హౌజ్ లను నిర్మించారు. బెంగళూరులోని ప్రధాన రహదారుల వెంబడి - జాతీయ రహదారుల వెంబడి - రైల్వే ట్రాక్ కిందినుంచి సుమారు 124 కిలోమీటర్ల ఎంఎస్ పైప్ లైన్ వేశారు. సాధారణంగా ఇనుప పైపులు కొంతకాలానికి తుప్పు పట్టి - భూమిలో కలిసిపోతాయి - ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రత్యేక పైపులను ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించింది. తుప్పు సమస్యను నిరోధించేలా - అధిక నీటి ప్రవాహ తీవ్రతను తట్టుకునేలా వీటిని రూపొందించారు. అంతేకాకుండా పైపుల వెలుపలి భాగంలో ఐరన్ మెష్ తో కప్పబడి ఉంటుంది. పైపుల కొనవద్ద సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేశారు. అలాగే 6 సబ్ స్టేషన్ తోపాటు ఆరు పంప్ హౌజ్ - అతిపెద్ద సర్జ్ ట్యాంక్ ను ఎంఈఐఎల్ నిర్మించింది.