Begin typing your search above and press return to search.

మ‌రో వైర‌స్ వార్త తెలిపిన చైనా: క‌జ‌కిస్తాన్‌ పై ఆరోప‌ణ‌లు

By:  Tupaki Desk   |   10 July 2020 4:45 PM GMT
మ‌రో వైర‌స్ వార్త తెలిపిన చైనా: క‌జ‌కిస్తాన్‌ పై ఆరోప‌ణ‌లు
X
మహమ్మారి వైర‌స్ జ‌న్మ‌కు కార‌ణ‌మైన చైనాలో మ‌రికొన్ని వైర‌స్‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టికే ఒక వైర‌స్‌తో మానవ ప్ర‌పంచం భ‌యాందోళ‌న చెందుతుండ‌గా ఇప్పుడు మ‌రికొన్ని వైర‌స్‌లు క‌ల్లోలం రేపుతున్నాయి. తాజాగా చైనా మ‌రో వైర‌స్‌పై ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఒక వైర‌స్ వెలుగులోకి వ‌చ్చింద‌ని.. క‌జ‌కిస్తాన్‌లో ఆ వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తోంద‌ని చైనా మరో బాంబు పేల్చింది. సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నార‌ని అంద‌రూ జాగ్రత్తగా ఉండాలని ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చరించింది.

గుర్తుతెలియని వైరస్‌ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు తెలిపింది. ప్ర‌స్తుత వైర‌స్ కంటే అత్యంత ప్రమాదకరంగా ఉంటోంద‌ని.. ఈ వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని క‌జ‌కిస్తాన్ దేశంలో నివసిస్తున్న చైనీయులకు సూచించింది.

‘‘క‌జ‌కిస్తాన్ లో ప్రాణాంతక ప్ర‌స్తుత వైరస్‌ కంటే అంతుపట్టని న్యుమోనియాతో సంభవిస్తున్న మరణాలే ఎక్కువగా ఉన్నాయి. ఆర్నెళ్లుగా 1,772 మంది మరణించారు. ఒక్క జూన్‌ నెలలోనే 628 మంది మృతి చెందారు. వీరిలో చైనీయులు కూడా ఉన్నారు. ఈ దేశ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వైరస్‌ ఆనవాళ్ల‌ను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతరకు దానిని గుర్తించలేకపోయారు. అందరూ జాగ్రత్తగా ఉండండి’’అని కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అయితే ఈ ప్ర‌క‌ట‌న‌పై శుక్ర‌వారం కజికిస్థాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌ను ఖండించింది. చైనా మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు ఒట్టి పుకార్లేనని క‌జ‌కిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. క‌జ‌కిస్తాన్లో సరికొత్త రకమైన న్యూమోనియా ప్రబలుతోందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రచురించిన సమాచారం సరైంది కాదు స్ప‌ష్టం చేసింది. బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని.. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్ల‌డించింది.