Begin typing your search above and press return to search.

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి దళిత నేత?

By:  Tupaki Desk   |   29 Nov 2019 7:01 AM GMT
బాబుకు మరో షాక్.. వైసీపీలోకి దళిత నేత?
X
అధికారం కోల్పోయిన చంద్రబాబు నుంచి నేతలు చేజారిపోతున్నారు. ఒక్కొక్కరిగా టీడీపీపై నమ్మకం సడలి పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ - దేవినేని అవినాష్ లు వైసీపీ గూటికి చేరారు. ఇక గంటా సహా 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపుచూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేతకు మరో భారీ షాక్ తగలబోతోందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీడీపీకి చెందిన సీనియర్ దళిత నాయకుడు - మాల మహనాడు మాజీ అధ్యక్షుడు - ఎస్సీ - ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ అయిన కారెం శివాజీ తర్వలోనే వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారన్న వార్త టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

టీడీపీ హయాంలో ఎస్సీ - ఎస్టీ కమిషన్ గా కారెం శివాజీ నియమితులయ్యారు. చంద్రబాబు ఈయనకు అత్యున్నత పదవిని ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఈయన తన పదవికి రాజీనామా చేయలేదు. ఆరు నెలల తర్వాత తాజాగా గురువారం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.

కాగా పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం కారెం శివాజీ తన వందలాది మంది అనుచరులతోపాటు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతాడని సమాచారం.

టీడీపీలో ఉద్దండులైన దళిత నేతలు ఇద్దరూ ఇలా వైసీపీలో చేరడం టీడీపీని కోలుకోనీయకుండా చేస్తోంది. ఇప్పటికే వైసీపీలోకి సీనియర్ దళిత టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ చేరారు. ఇప్పుడు ఆయన బాటలోనే కారెం శివాజీ వైసీపీ బాట పడుతున్నారు.

కాగా జూపూడి లాగే కారెం శివాజీ కూడా వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి మద్దతుగా వైసీపీపై నిప్పులు చెరిగారు. అలాంటి ఇద్దరు నేతలు ఇప్పుడు వైసీపీ గూటికి చేరుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.. మరి ఇలాంటి నాయకులను చేర్చుకోవడంలో వైసీపీ స్టాండ్ ఏంటనేది తెలియాల్సి ఉంది. రాజకీయ మనుగడ కోసం వస్తున్న ఈ నేతల విషయంలో వైసీపీ అధిష్టానం కాస్తంతా జాగ్రత్తగా ఉంటే మంచిదని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.