Begin typing your search above and press return to search.

జంపింగ్స్ మీద బాబు ప్లాన్ చెప్పిన కరణం

By:  Tupaki Desk   |   4 July 2016 4:55 AM GMT
జంపింగ్స్ మీద బాబు ప్లాన్ చెప్పిన కరణం
X
కీలక అంశాల మీద మాట్లాడేటప్పుడు ముందు వెనుకలు చూసుకోవాలి. కానీ..ఏపీ తెలుగుదేశం నేతలు ఆ విషయాల్ని పట్టించుకోవటం లేదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే.. మీడియాకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలలో.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కాస్త రెచ్చగొట్టేలా ప్రశ్నను సంధిస్తే.. బ్యాలెన్స్ కోల్పోవటం కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాద్.. ఎన్నికల ఖర్చు విషయంలో చెప్పిన మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. తన మీద వస్తున్న విమర్శలపై కోడెల వివరణ ఇచ్చినా.. అవి జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేసే స్థాయిలో ఉండటం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తాజాగా ఒక టీవీ చానల్ లో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం ఆసక్తికర వ్యాఖ్యల్ని చేశారు. ప్రత్యేక ఇంటర్వ్యూ అన్నాక ఆసక్తికర వ్యాఖ్యలు రావటం మామూలే.కానీ.. ఆ క్రమంలో తాము చేసే వ్యాఖ్యలు పార్టీకి..ప్రభుత్వానికి తలనొప్పిగా మారకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ..కరణం బలరాం మాటలు విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. పార్టీ పట్ల.. పార్టీ అధినేత విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

ఇటీవల జగన్ పార్టీ నుంచి తమ పార్టీలో చేరిన నేతల గురించి.. అలా జరగటానికి తమ పార్టీ ప్లాన్ అంటూ కరణం బలరాం చెప్పిన మాటల్నే చూస్తే..రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో సీటు కోసమే తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకున్నట్లుగా ఆయన చెప్పటం గమనార్హం. ఇప్పటికే పార్టీ జంపింగ్స్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. జగన్ పార్టీ జంపింగ్స్ మొత్తం రాజ్యసభ ఎన్నికల్లో మరో సీటు కోసమంటూ బాబుసర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసేలా కరణం మాట్లాడారన్న అభిప్రాయంవ్యక్తమవుతోంది. ఈ ఒక్క వ్యాఖ్యే కాదు.. మరికొన్ని వ్యాఖ్యలు సైతం పార్టీకి ఇబ్బందికరంగా మారేలా ఉన్నాయి. అదే సమయంలో ఆయన ఇమేజ్ పెరిగేలా కరణం బలరాం మాటలు ఉండటం గమనార్హం.

కరణం చేసిన వ్యాఖ్యలు చూస్తే..

= టీడీపీలో చేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నా దృష్టిలో ఓ కిడ్. అతడ్ని పార్టీలో చేర్చుకోవటం వల్ల క్యాడర్ కు సమాధానం చెప్పుకోలేకపోతున్నాం.

= కరణం బలరాం ఔట్ డేటెడ్ నాయకుడు.. ఆయన వారసుడు కరణం వెంకటేశ్ ఆవేశపరుడన్న అంశాల్ని చూసే.. చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకుంటే లాభం లేదు.

= టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబే స్వయంగా చెప్పారు. నా సిన్సియారిటీ ఏమిటో బాబుకు తెలుసు.

= మొదట్లో చంద్రబాబు మంత్రి కావటానికి ఢిల్లీలో ఎంతో కష్టపడ్డా (అప్పట్లో ఇద్దరూ కాంగ్రెస్ లో ఉండేవారు) ఇప్పుడా విషయం అప్రస్తుతం అనుకోండి(అలాంటప్పుడు ఆ విషయాల్ని ప్రస్తావించటం ఎందుకో..?)

= ఎన్టీఆర్ అల్లుళ్లు అయిన చంద్రబాబు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుల కారణంగా నేనే భారీగానష్టపోయా.

= 1972 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి.. 1978లో ఎమ్మెల్యేగా గెలిచా.అప్పటి నుంచి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నా.

= నేను.. చంద్రబాబు.. కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ లో ఉండేవాళ్లం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవుదూడ కాంగ్రెస్ లో ఉండేవారు. వెంకయ్యనాయుడు జనతా పార్టీలో ఉండేవారు.

= నేను అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఎవరైనా చెబితే.. నేను రాజకీయాల్ని శాశ్వితంగా వదిలేస్తా. నా హయాంలోనే గుండ్లకమ్మ ప్రాజెక్టు కట్టించా. ఆ ప్రాజెక్టు పుణ్యమా అని ఈరోజు ఒంగోలు ప్రజలు నీళ్లు తాగుతున్నారు.

= 1978 ఎన్నికల టూర్ లో భాగంగా ఇందిరాగాంధీ కర్ణాటక నుంచి ఒంగోలుకు వచ్చారు. ఆమెకు ఏర్పాటు చేసిన డయాస్ కూలిపోయింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు సరైన భద్రత కల్పించలేదు. ఒక్క పోలీసోడు లేడు.ఆమెను అవమానించాలని ఆమెకు సెక్యూరిటీ లేకుండా చేశారు. అప్పట్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నా. నేనే స్వయంగా కారు నడుపుతూ ఆమెను మా జిల్లా దాటించా. అలా ఆమెకు అండగా నిలిచా. ఆ తర్వాత జరిగిన ఒక మీటింగ్లో ‘‘బలరాం ఈజ్ మై థర్డ్ సన్’ అని ఇందిరాగాంధీనే అన్నారు. వందల వేల కోట్లు వస్తే తృప్తి కలుగుతుందా?ఇందిరాగాంధీనే తన మూడోకొడుగ్గా అనటానికి మించిన తృప్తి ఇంకేం ఉంటుంది..?