Begin typing your search above and press return to search.

పవన్ కోసం రంగంలోకి కాపు సంక్షేమ సేన

By:  Tupaki Desk   |   29 Sep 2021 4:30 AM GMT
పవన్ కోసం రంగంలోకి కాపు సంక్షేమ సేన
X
జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు, మద్దతుదారుల విమర్శలపై కాపు సంక్షేమ సేన స్పందించింది. దీనికి సంబంధించి ఒక లేఖను విడుదల చేసింది. కాపు మంత్రులు, పవన్ ను తిట్టడం వెనుక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించింది. పవన్ ను అవమానించడం అంటే కాపు సమాజాన్ని అవమానించడమేనని పేర్కొంది.

2024 ఎన్నికల్లో వీటి పర్యావసనాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని కాపుసంక్షేమ సేన హెచ్చరించింది. ఈ మేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య సదురు లేఖలో పేర్కొన్నారు.

తాజాగా సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు, మద్దతుదారులు మూకుమ్మడిగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంతో మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలసీ ‘ఉగ్రవాదం’ అంటూ మండిపడ్డారు. ఈ విధానాలతో రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాలు నాశనం అయిపోయాయని ఫైర్ అయ్యారు. ఈ ఉగ్రవాద పాలసీని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

నిన్నా మొన్నా పవన్ పై వరుసగా నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేసి అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారని పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోసానిపై పవన్ ఫ్యాన్స్ దాడికి యత్నించారు. పంజాగుట్ట పీఎస్ లో పోసానిపై ఫిర్యాదు కూడా చేశారు.