Begin typing your search above and press return to search.

తిరుమలలో పవన్ చూపిన దారిలో ‘కన్నా’

By:  Tupaki Desk   |   30 May 2018 8:21 AM GMT
తిరుమలలో పవన్ చూపిన దారిలో ‘కన్నా’
X
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోరిన కోర్కెలు తీర్చే తిరుమల వెంకన్నను ఈరోజు నూతన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని తరించారు.. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను కన్నా లక్ష్మీనారాయణకు అందజేశారు.

ఇక అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన కన్నాకు స్థానిక బీజేపీ నాయకులు శాలువాలు - స్వామి వారి చిత్రపటాలు బహూకరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా కన్నాను మీడియా చుట్టుముట్టగా రాజకీయాల గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తనకు పదవి దక్కినందుకు కృతజ్ఞతగానే తిరుమల వెంకన్నను దర్శించుకొని తలనీలాల మొక్కు సమర్పించుకున్నానని స్థానిక నాయకులతో కన్నా అన్నారు. అంతేకాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తన తొలి పర్యటన చిత్తూరు జిల్లాలో చేయబోతున్నానని.. రెండు రోజుల పాటు పర్యటించి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

ఇక పవన్ కళ్యాన్ దారిలోనే కన్నా నడిచారు. తిరుమల వెంకన్న పవిత్రత దృష్ట్యా అక్కడ రాజకీయాల గురించి వ్యాఖ్యానించనని తెలిపి ఆకట్టుకున్నారు. పవన్ చూపిన ఈ బాటను మిగతా నాయకులు కూడా పాటిస్తూ రాజకీయాల్లో ఓ గొప్ప స్ఫూర్తిని చాటుతున్నారని స్థానిక బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం విశేషం..