Begin typing your search above and press return to search.

బాబు ఓ టెంప‌ర‌రీ సీఎం..హెరిటేజ్ సంగ‌తి ఏంటి?

By:  Tupaki Desk   |   5 April 2018 5:22 PM GMT
బాబు ఓ టెంప‌ర‌రీ సీఎం..హెరిటేజ్ సంగ‌తి ఏంటి?
X
టీడీపీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై ఆయ‌న మీడియాతో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాబు ఓ టెంప‌ర‌రీ సీఎం అని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ప‌రిపాల‌న నిర్మాణాల‌ను చూసిన వారు ఈ మాట‌లు అంటున్నార‌ని వ్యాఖ్యానించారు. అమరావతిలో క‌న్నా విలేకరులతో మాట్లాడుతూ...ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చంద్ర‌బాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. ఏనాడు అమరావతికి దండం పెట్ట‌ని చంద్రబాబు ఫొటోలో పోజుల కోసం పార్లమెంటుకు మొక్కుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఫెయిల్యూర్ అనే విష‌యం టీడీపీ నేత‌ల‌కు సైతం తెలుసని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చంద్రబాబును కలవడానికి ఎవరు ముందుకు రాలేదని - ఎంపీ హేమా మాలినిని క‌లిసి అదే విష‌యాన్ని ఆర్భాటంగా ప్ర‌క‌టించుకున్నార‌ని ఎద్దేవా చేశారు. హేమామాలినిని కలిసి ఆంధ్రుల పరువు తీశారని విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నే కాదు...గ‌తంలో చేసిన విదేశీ ప‌ర్య‌ట‌నలు సైతం ప్ర‌చారాం కోస‌మేన‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మండిప‌డ్డారు. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప రాష్ట్రానికి ఏం సాధించార‌ని ఆయ‌న ప్రశ్నించారు.

చంద్ర‌బాబు డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌ కు మారు పేర‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించారు. చంద్రబాబునాయుడి లేఖతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిందని - అయిన‌ప్ప‌టికీ విభ‌జ‌న‌లో త‌మ పాత్రేమీ లేద‌ని అంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానించిందీ - ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో అభినందన తీర్మానం చేసింది కూడా చంద్రబాబేనని చెప్పారు. హోదాకు బదులు ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని, పారిపోయి వచ్చి కట్టుబట్టలతో పంపారని అబద్దాలు చెబుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకురాలేదని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సూటిగా నిల‌దీశారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అధికారంలోకి రావడానికి అడ్డుగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అవినీతి అసమర్థత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని కప్పిపుచ్చుకొనేందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ముంచాలని చూస్తూ చంద్రబాబు మునిగిపోతున్నారని.. ఆయన మోసాలను ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. రైల్వే జోన్ ఇస్తామని ఎన్నడూ బీజేపీ చెప్పలేదని - ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపింది బీజేపీనేని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణాలను కావాలనే ఆలస్యం చేస్తూ.. తన తప్పులను బీజేపీపై రుద్దాలని బాబు భావిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రయోజనాలు కోసం చంద్రబాబు ఏనాడూ పోరాటం చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో జల్సా చేస్తున్నారని - ప్రజలు కట్టిన పన్నులు టీడీపీ కార్యకర్తలు పంచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. అమెరికాలో కూడా లేని రేట్లతో తాత్కాలిక భవనాలకు కోసం ఖర్చు చేస్తున్నారని, తాత్కాలిక భవనాలు కడుతున్న సీఎంను ప్రజలు తాత్కాలిక సీఎంగానే చూస్తున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.