Begin typing your search above and press return to search.

మా ఆయ‌న అమాయ‌కుడు: ఢిల్లీ లిక్క‌ర్ కేసులో శ‌ర‌త్ చంద్రారెడ్డి భార్య క‌నిక వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   20 Nov 2022 7:10 AM GMT
మా ఆయ‌న అమాయ‌కుడు:  ఢిల్లీ లిక్క‌ర్ కేసులో శ‌ర‌త్ చంద్రారెడ్డి భార్య క‌నిక వ్యాఖ్య‌లు
X
త‌ప్పు చేసిన వారు ఎవ‌రు మాత్రం ఒప్పుకొంటారు? పైగా.. బుకాయిస్తారు కూడా! ఇదీ.. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌. అచ్చు ఇలానే తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కీల‌క‌మైన హ‌స్తం ఉంద‌ని భావిస్తున్న శ‌ర‌త్ చంద్రారెడ్డి గురించి ఆయ‌న భార్య క‌నికా టెక్రివాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. `మా ఆయ‌న అమాయ‌కుడు`` అని మీడియా ముందు చెప్పారు. అంతేకాదు.. నగదు, మద్యం తరలించడానికి తమ విమానాలను ఉపయోగించలేదని టెక్రివాల్ రెడ్డి స్పష్టం చేసేశారు.

చార్టర్ విమానాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయా ప్రాంతాలకు నగదును తరలించ‌డంపై ఆమె స్పందిస్తూ ఆ ఆరోపణల న్నీ నిరాధారమైనవన్నారు. తమ సంస్థ కార్యకలాపాలపై చట్టబద్ధంగా ప్రశ్నలు వేస్తే తాము సమాధానాలిస్తామని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యిన త‌న భ‌ర‌త్ శరత్‌చంద్రాడ్డి అమాయకుడని, మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని కనికా పేర్కొన్నారు. దీనిని తాను పైకోర్టుల్లో తేల్చుకుంటామ‌ని చెప్పారు.

ఇదిలావుంటే, ఢిల్లీ లిక్క‌ర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించింది. సుమారు ఆర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ‘జెట్‌ సెట్‌ గో’ సంస్థ ద్వారా కనికా టెక్రివాల్‌ ప్రత్యేక విమానాలు నడుపుతు న్నారు.

అయితే, ఈ సంస్థ నడిపిన విమానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ప్రయాణించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఉన్నారని గుర్తించారు. దీంతో ఈ సంస్థ నడిపిన విమాన సర్వీసుల వివరాలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆప్‌ ఇండియా (ఏఏఐ) నుంచి గతనెల 18న జెట్‌ సెట్‌ గో సంస్థ వివరాలను ఈడీ సేకరించింది.

జెట్‌ సెట్‌ గో సంస్థ ద్వారా నడుస్తున్న విమానాలు ఏమిటి? సంస్థ కార్యనిర్వహణ ఏవిధంగా ఉంది? సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిపినటువంటి కార్యకలాపాలు, చార్టెర్డ్‌ విమానాల ద్వారా ప్రయాణించిన ప్రయాణికులు, మేనేజర్ల వివరాలను ఏఏఐ నుంచి ఈడీ సమాచారం తీసుకుంది. ఈ సమాచారం ఆధారంగానే వివరాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే కనికాను విచారణకు పిలిచి ప్రశ్నించామని ఈడీ అధికారులు వెల్లడించారు.