Begin typing your search above and press return to search.

బాలక్రిష్ణకు షాకిస్తున్న ఆప్తమిత్రుడు

By:  Tupaki Desk   |   27 Oct 2019 8:06 AM GMT
బాలక్రిష్ణకు షాకిస్తున్న ఆప్తమిత్రుడు
X
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఇప్పుడా పార్టీ భవిష్యత్ పై టీడీపీ నేతల్లో అనుమానాలు మొదలయ్యాయి. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే భవిష్యత్ ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. తాజాగా కృష్ణ జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఆయన బాటలోనే మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

కదిరి మాజీ ఎమ్మెల్యే - టీడీపీ నేత కదిరి బాబూరావు వైసీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే అయిన కదిరి బాబూరావు హీరో - టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణకు ఆప్తమిత్రుడు. అయితే పోయినిసారి టీడీపీ అధినేత కోరిక మేరకు కనిగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టడం ఆయన ఓటమికి దారితీసింది.

2014 ఎన్నికల్లో కనిగిరి నుంచి టీడీపీ తరుఫున పోటీచేసి కదిరి బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టీడీపీలో చేరడంతో వారి ఫ్యామిలీకి కనిగిరి సీటును చంద్రబాబు కేటాయించారు. చంద్రబాబు ఆదేశాలు.. బాలక్రిష్ణ సూచనల మేరకు అయిష్టంగానే దర్శి నియోజకవర్గానికి కదిరి బాబూరావు మారారు. అదే ఆయన రాజకీయ భవిష్యత్ ను ముంచేసింది. కనిగిరిలో ఎంతో పట్టున్న బాబూరావు నియోజకవర్గం మారడంతో ఓడిపోయారు. తాను నిలబెట్టుకున్న ఓటు బ్యాంకును శిద్ధా కుటుంబానికి ఇచ్చి తాను ఓడిపోయానని ఆవేదన చెందాడు.

అయితే ప్రకాశం జిల్లా టీడీపీలో ఒక సామాజికవర్గం ఆదిపత్యం చెలాయించడం.. పార్టీలో ఉంటే మనుగడ కష్టమని నిర్ధారణకు వచ్చిన కదిరి ఎట్టకేలకు బాలక్రిష్ణతో తనకున్న స్నేహాన్ని కాలదన్ని మరీ వైసీపీలో చేరేందుకు డిసైడ్ అయినట్టు తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చు అంటున్నారు. ఈ పరిణామం బాలక్రిష్ణకు, చంద్రబాబుకు షాకింగ్ లా మారడం ఖాయమంటున్నారు.