Begin typing your search above and press return to search.

రాజకీయ పార్టీలు ఎప్పటికి మర్చిపోలేని రీతిలో జస్టిస్ నారిమన్ ఆదేశాలు

By:  Tupaki Desk   |   11 Aug 2021 5:31 AM GMT
రాజకీయ పార్టీలు ఎప్పటికి మర్చిపోలేని రీతిలో జస్టిస్ నారిమన్ ఆదేశాలు
X
నేరమయ రాజకీయాలపై సుప్రీం చర్నాకోలు విసిరింది. ఎంత చెప్పినా రాజకీయ వ్యవస్థలో మార్పులు రాని నేపథ్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. పలు ఆదేశాల్ని ఇచ్చింది. ఈ సందర్భంగా తమ వరకు వచ్చిన అంశాలపై అధికార బీజేపీ.. విపక్ష కాంగ్రెస్ తో పాటు తొమ్మిది రాజకీయ పార్టీలకు జరిమానాను విధిస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. తాము ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలకు షాకిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులపై సత్వరం విచారణ చేపట్టాలని.. వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విదించాలని బీజేపీ నేత ఒకరు 2016లో పిటిషన్ దాఖలు చేస్తే.. తాజాగా విచారణను చేపట్టింది సుప్రీం ధర్మాసనం.

ఈ సందర్భంగా ప్రస్తుత.. మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్ క్రిమినల్ కేసులు అంతకంతకు ఎక్కువ అవుతున్నట్లుగా సుప్రీం ధర్మాసనానికి నివేదికను సమర్పించారు న్యాయవాది హన్సారియా. రాజకీయాల్ని నేరరహితం చేయాలని ఎంత చెబుతున్నా.. పార్టీలు మొద్దునిద్ర వీడటం లేదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్.. జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం తాజాగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్రను బయటపెట్టాలన్న తమ ఆదేశాల్ని అమలు చేయని తొమ్మిది రాజకీయ పార్టీలకు తాజాగా జరిమానా విధించారు. అంతేకాదు.. అభ్యర్థుల్ని ఎంపిక చేసిన 48 గంటల్లో వారి నేరచరిత్రను ప్రచురించి తీరాలని పార్టీలను ఆదేశించారు. గతంలో ఈ గడువు ఎక్కువగా ఉండేది. దీన్ని సవరిస్తూ ఆదేశాల్ని జారీ చేశారు.

తమ ఆదేశాల్ని పాటించని రాజకీయ పార్టీలపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని.. వాటి ఎన్నికల గుర్తుల్ని సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటాన్ని గణాంకాలతో సహా ప్రస్తావన వచ్చింది. 2004లో 24 శాతం మంది పార్లమెంటు సభ్యులపై క్రిమినల్ కేసులు ఉంటే.. 2009నాటికి ఇవి కాస్తా 30 శాతానికి పెరిగాయి. 2014లో 34 ఉంటే.. 2019 నాటికి 43 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తీర్పు రాసిన జస్టిస్ నారిమన్ పేర్కొనటం గమనార్హం.

అభ్యర్థుల ఎంపిక చేసిన 48 గంటల్లో కానీ నామినేషన్ దాఖలు చేయటానికి రెండు వారాలకు ముందు కానీ వారి నేర చరిత్రను ప్రచురించాలని గత ఫిబ్రవరిలో ఇదే ధర్మాసనం ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా వాటిని మార్చారు. గతానికి భిన్నంగా ఇప్పుడు 48 గంటలే సమయాన్ని ఇచ్చారు. అభ్యర్థుల్ని ఎంపిక చేసిన 48 గంటల్లో అన్ని పార్టీలు వారి క్రిమినల్ రికార్డుల్ని తమ తమ వెబ్ సైట్లలో పెట్టాలని.. రెండు దినపత్రికల్లో ఆ వివరాల్ని ప్రచురించాలని జస్టిస్ నారిమన్ తేల్చి చెప్పారు.

ఈ ఆదేశాల్ని అమలు చేశామని చెబుతూ ఎన్నికల కమిషన్ కు కంప్లయన్స్ నివేదికను పార్టీలు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఒక మొబైల్ యాప్ రూపొందిచి.. ఓటర్లు తెలుసుకునేలా వారి నేర చరిత్రను అందులో ఉంచాలని పేర్కొంది. మొత్తంగా తన తాజా ఆదేశాలతో రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించేలా చేయటంతో జస్టిస్ నారిమన్ తన బాధ్యతను నూటికి నూరు శాతం అమలు చేశారని చెప్పక తప్పదు. ఒక విధంగా నేరరహిత రాజకీయాల్ని కోరుకునే ప్రజలందరికి ఆయనో స్ఫూర్తిదాతగా నిలుస్తారనటంలో సందేహం లేదు.