Begin typing your search above and press return to search.

జస్టిస్ ఈశ్వరయ్య పిటీషన్ ..సుప్రీం లో ముగిసిన విచారాణ , తీర్పు రిజర్వ్ !

By:  Tupaki Desk   |   22 Feb 2021 8:50 PM IST
జస్టిస్ ఈశ్వరయ్య పిటీషన్ ..సుప్రీం లో ముగిసిన విచారాణ , తీర్పు రిజర్వ్ !
X
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య దాఖలు చేసిన అప్పీల్ ‌పై సుప్రీం లో విచారణ ముగిసింది. జిల్లా జడ్జి రామకృష్ణతో జరిపిన ఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఇదివరకే నిరాకరించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిని రేపుతోంది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ ‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ జస్టిస్ రామకృష్ణతో తాను నిర్వహించిన టెలిఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు సమగ్ర విచారణ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడాన్ని ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఆయన అప్పీల్ చేశారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోవవాదాలను ఆలకించింది.

జస్టిస్ ఈశ్వరయ్య తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్, దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ‌పై సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తమ వాదనలను వినిపించారు. జస్టిస్ ఈశ్వరయ్యకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై కపిల్ సిబల్ వాదనలను వినిపిస్తూ.. జస్టిస్ రామకృష్ణతో ఈశ్వరయ్య జరిపిన సంభాషణను ఎడిట్ చేశారనడంలో అర్థం లేదని అన్నారు. ఎడిట్ చేశారనే విషయాన్ని ఎవరూ నిర్ధారించలేదని చెప్పారు. జస్టిస్ రామకృష్ణతో ఈశ్వరయ్య జరిపిన సంభాషణ వెనుక ఎలాంటి మర్మం లేదని, ప్రెస్ కాన్ఫరెన్స్‌ లల్లో పలువురు ప్రస్తావించిన అంశాలనే ఆయన కూడా జస్టిస్ రామకృష్ణతో చర్చించారని ప్రశాంత్ భూషణ్ వాదించారు. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.