Begin typing your search above and press return to search.

వైసీపీ నేత మాటః దేవినేని పిచ్చికుక్క క‌రిచింది

By:  Tupaki Desk   |   26 Jun 2016 5:39 PM GMT
వైసీపీ నేత మాటః దేవినేని పిచ్చికుక్క క‌రిచింది
X
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దేవినేనిని పిచ్చికుక్క క‌రిచింద‌ని.. ఆయ‌న అమావాస్య‌.. పౌర్ణ‌మి రోజుల్లో పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. దేవినేని అంతటి నీచమైన.. అజ్ఞాన.. అసమర్థ నీటి పారుదల మంత్రిని తాను ఇంత వరకు చూల్లేదని.. ఆయ‌న ఓ ద‌ద్ద‌మ్మ అని.. అందువ‌ల్లే పులిచింతల ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని విమ‌ర్శించారు. రూ.1600 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి.. అందులో రూ.500 కోట్లు నొక్కేశారని ఆరోపించారు. దేవినేని నోరు అదుపులో పెట్టుకోవాల‌ని.. ఆయ‌న‌ పోలీసు పహారా లేకుండా తిర‌గ‌లేని పిరికివాడ‌ని అన్నారు జోగి ర‌మేష్‌. దేవుడు కరుణిస్తే తప్ప నీళ్లివ్వలేని దద్దమ్మ దేవినేని అని కూడా వ్యాఖ్యానించారు.

తెలుగు దేశం ప్ర‌భుత్వం దోపిడీ దుర్మార్గాలకు జగన్ అడ్డుపడటమే తప్పా అని ప్రశ్నించిన జోగి.. కృష్ణా పుష్కరాలకు సంబంధించిన నిధుల్లో భారీ దోపిడీ జ‌రుగుతోంద‌న్నారు. ప్రజల డబ్బు దోచుకుంటున్నప్పుడు ప్రశ్నించడం తప్పా అని ప్ర‌శ్నించారు. ఇసుక నుంచి మట్టి వరకు దోపిడీ చేశారని.. అందులో తెదేపా నాయ‌కుల వాటా లేద‌ని విజ‌య‌వాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. దేవుడి భూములను కూడా దోచుకుంటున్నార‌ని.. సదావర్తి భూముల స్వాహాలో ముఖ్యమంత్రి చంద్రబాబు త‌న‌యుడు లోకేష్ పాత్ర ఉందని ఆయ‌న ఆరోపించారు. ఈ విష‌యంలో మంత్రి మాణిక్యాల రావు లేదా బీజేపీ నాయ‌కులు నిజానిజాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు.