Begin typing your search above and press return to search.

నన్ను గెలిపిస్తే భారతీయులకే మేలు : జో బైడెన్‌

By:  Tupaki Desk   |   17 Aug 2020 5:30 PM GMT
నన్ను గెలిపిస్తే భారతీయులకే మేలు :  జో బైడెన్‌
X
అమెరికాలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు కరోనా మహమ్మారి అమెరికాను వణికిపోయేలా చేస్తున్నా కూడా, త్వరలోనే ఎన్నికలు జరగబోతుండటంతో నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి డెమొక్రాటిక్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సమయంలోనే ఆయన భారతీయులపై హామీల వర్షం కురిపించారు. తనని అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్‌ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్‌ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్‌ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ వ్యాఖ్యానించారు.

ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్‌లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞచేశారు. పదిహేనేళ్ల క్రితం భారత దేశంతో చారిత్రాత్మక అణ్వాయుధ ఒప్పందం కొరకు ప్రయత్నం చేశాను. భారత్, అమెరికాల మధ్య మైత్రీ సంబంధాలు బలపడితే, యావత్‌ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని ఆనాడే నేను చెప్పాను’’అని భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి జో బైడెన్‌ మాట్లాడారు.

ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, దేశ చరిత్రలోనే అత్యధికంగా భారతీయులను వివిధ పదవుల్లో నియమించినట్లు, ఇప్పుడు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షురాలిగా పోటీలో నిలిపామని ఆయన అన్నారు. హెచ్‌–1బీ వీసాల విధానాన్ని సంస్కరించి, గ్రీన్‌ కార్డుల కోసం దేశాల వారీగా ఇచ్చే కోటా విధానాన్ని రద్దు చేస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో జాతి విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇతర దేశాల వారిపై ఆంక్షలు విధిస్తూ, హెచ్‌–1బీ వీసాలపై హానికరమైన, కఠిన చర్యలకు పూనుకుంటున్నారని బైడెన్‌ వ్యాఖ్యానించారు. గ్రీన్‌ కార్డుల సంఖ్యను పెంచుతామని, కుటుంబ సభ్యుల రాకపై ఆంక్షలు తొలగిస్తామని, అమెరికాలో చదివిన విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేస్తామని, ఉపాధి కోసం వచ్చేవారికి ఉద్యోగ వీసాల సంఖ్యను పెంచుతామని చెప్పారు.