Begin typing your search above and press return to search.

ఢిల్లీలో జరిగే రేప్ లకు కారణం వారేనా?

By:  Tupaki Desk   |   26 Feb 2016 8:09 AM GMT
ఢిల్లీలో జరిగే రేప్ లకు కారణం వారేనా?
X
ఎప్పడూ లేని విధంగా జేఎన్ యూ వర్సిటీ మీద తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. మొన్నామధ్య ఉగ్రవాది అప్ఝల్ గురు సంస్మరణ సభ నిర్వహణ.. దీన్ని నిర్వహించిన విద్యార్థుల అరెస్ట్ చేయటం.. బాధ్యులపై దేశద్రోహం కేసు నమోదుతో వాతావరణం వేడెక్కటం తెలిసిందే. ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతుంటే.. వారి రాజకీయ ప్రయోజనాలు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో సాక్ష్యాలు చూపిస్తూ చేసిన ప్రసంగం విపక్షాల్ని ఇరుకున పడేశాయి.

ఇదిలా ఉంటే.. జేఎన్ యూ విద్యార్థుల తీరు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే అహుజా.. తాజాగా మరోసారి గళం విప్పారు. రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. జేఎన్ యూ విద్యార్థులు నిత్యం వందలాది మందుబాటిళ్లు ఖాళీ చేయటం.. ప్యాకెట్లకు ప్యాకెట్లు సిగిరెట్లు కాల్చేయటం.. మాంసాహారం తినటం లాంటివి చేస్తారన్న వ్యాఖ్యలతో పాటు.. వందలాది కండోమ్ ప్యాకెట్లు క్యాంపస్ లో దర్శనమిస్తాయని పేర్కొన్నారు. గర్భ నిరోధక ఇంజెక్షన్లు చేసుకుంటారని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం కూడా సీరియస్ అయ్యింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే అహుజా తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మహానగరంలో జరిగే అత్యాచారాల్లో.. లైంగిక వేధింపుల్లో 50 శాతం ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులే కారణమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అహుజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తుండగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టించటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.