Begin typing your search above and press return to search.

బీజేపీపై తగ్గేదేలే.. జిగ్నేశ్ మేవాణీ పుష్ప యాక్షన్

By:  Tupaki Desk   |   30 April 2022 1:30 PM GMT
బీజేపీపై తగ్గేదేలే.. జిగ్నేశ్ మేవాణీ పుష్ప యాక్షన్
X
నాలుగేళ్ల కిందట జరిగిన గుజరాత్ ఎన్నికల్లో ఇద్దరు కుర్రాళ్లు అధికార బీజేపీని కలవర పెట్టారు. దాదాపు బీజేపీని ఓడించినంత పనిచేశారు. వారిలో ఒకరు హార్దిక్ పటేల్. మరొకరు జిగ్నేశ్ మేవానీ. వీరిలో హార్దిక్ పటేల్ కాగా.. జిగ్నేశ్ దళితుడు. ఇద్దరూ కాంగ్రెస్ తరఫునే బీజేపీపై కాలుదువ్వారు. ఇక జిగ్నేశ్ కు ఆలోచనా పరుడిగానూ పేరుంది. విద్యావంతుడైన అతడి కార్యక్రమాలు, ఆలోచనలన్నీ నిమ్న వర్గాలు, మైనారిటీల చుట్టూనే తిరుగుతుంటాయి. అంతేగాక, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తుంటారు. ఒకవేళ కాంగ్రెస్ జిగ్నేశ్ ను చక్కగా ఉపయోగించుకుని ఉంటే అతడు గుజరాత్ లో పార్టీకి పెద్ద నాయకుడిగా ఎదిగేవాడు. ఇప్పటికే తన చర్యలతో బీజేపీని ఇరుకున పెడుతున్న అతడిపై కేంద్రం టార్గెట్ పెట్టింది. అస్సాంలో మహిళా కానిస్టేబుల్‌ను దుర్భాషలాడినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శుక్రవారం బెయిల్ వచ్చింది.

అయితే, జైలు నుంచి బయటికి వచ్చి రాగానే అ‍ల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ(తలవంచను).. తగ్గేదే లే.. డైలాగ్‌ కొట్టాడాయన. మీడియా ఛానెల్‌ ముందు పుష్పరాజ్‌ తరహా మేనరిజాన్ని ప్రదర్శించాడు. అధికారం ఉందని ఓ మహిళను అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు బనాయించారంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించాడు . "నా అరెస్ట్‌ సాధారణ విషయం కాదు. పీఎంవోలో ఉన్న పొలిటికల్‌ బాస్‌ల సూచనలతోనే జరిగింది. నేను చేసిన ట్వీట్‌లో తప్పేంలేదు. ఆ విషయం ఇప్పటికీ గర్వంగా చెప్తున్నా.. మతఘర్షణలను, అల్లర్లను చూసి ఈ దేశంలో ఒక పౌరుడిగా శాంతి సామరస్యాలను కాపాడమని దేశ ప్రధానిని కోరా. అడగడానికి నాకు హక్కు ఉంది. అంటేకాదు చట్ట సభ ప్రతినిధిగా శాంతిని పాటించాలని ప్రజలను కోరా. అది నా విధి. అదేగా నేను చేసింది. దానికే కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు అని మేవానీ అన్నాడు. ఆపై ఒక మహిళను అడ్డుపెట్టి.. కథను అల్లి మరో కేసు పెట్టారు.

పిరికిపంద చర్యే ఇది. గుజరాత్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అందుకే బీజేపీ ఇలా చేస్తోంది అని మేవానీ ఆరోపించారు. అరెస్ట్‌ వేళ తనకు మద్దతు ఇచ్చిన అస్సాం ప్రజానీకానికి, కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపాడాయన. అలాగే ఎక్కడో అస్సాంలో తనను అరెస్ట్‌ చేయడం, కేసులు బనాయించి బయటకు రాకుండా చేయడం.. ముమ్మాటికీ బీజేపీ కుట్రే అని అంటున్నాడు. ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు వీళ్లు. అలాగే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నన్నూ టార్గెట్‌ చేశారు. దళితులు, గుజరాత్‌ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారు. గుజరాత్‌ ఎన్నికల్లో వాళ్లు(బీజేపీ) మూల్యం చెల్లించుకోక తప్పదు. అని పేర్కొన్నాడు ఎమ్మెల్యే మేవానీ. మహిళా కానిస్టేబుల్‌పై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని "కావాలనే" ఇరికించేందుకు ప్రయత్నించారంటూ అస్సాం పోలీసులపై అక్కడి కోర్టు మండిపడింది. బార్‌పేట కోర్టు మేవానీకి బెయిల్‌ మంజూర్‌ చేసే క్రమంలో తీవ్రంగా పోలీసులను మందలించింది. రాష్ట్రాన్ని పోలీస్‌ స్టేట్‌గా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు గుజరాత్‌లో ఏప్రిల్ 20న జిగ్నేష్‌ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 25న ఆయనకు బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే ఆయనను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడి దాడి చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 26న బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా బార్పేట చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముకుల్ చెతియా.. బెయిల్ నిరాకరించి ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మేవానీ ఏప్రిల్ 28న మరోసారి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా, వాదనలు విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. 29న బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 1,000 వ్యక్తిగత బాండ్‌పై కోర్టు బెయిల్‌ ఇచ్చిందని మేవానీ
తరపు న్యాయవాది అంగ్షుమన్ బోరా తెలిపారు.

దీన్ని బట్టే ఇది అక్రమ కేసు అని అర్థమవుతోందన్నారు. మొదటి కేసుకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి మేవానీని తిరిగి కొక్రాఝర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని, ఆపై విడుదల చేస్తారని.. దీనికి ఒక రోజు పట్టవచ్చని బోరా చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రపూరితంగా తనను కేసుల్లో ఇరికించాయని మెవానీ అంతకుముందు ఆరోపించారు. కాగా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అధికార బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా మేవానీ అరెస్ట్‌ను విపక్షాలు పేర్కొంటున్నాయి.