Begin typing your search above and press return to search.

మూర్ఖులు - ఈడియ‌ట్స్‌ - ఫూల్స్: జేడీ ఇవి త‌గునా..!

By:  Tupaki Desk   |   11 Aug 2019 5:45 AM GMT
మూర్ఖులు - ఈడియ‌ట్స్‌ - ఫూల్స్: జేడీ ఇవి త‌గునా..!
X
ఎవరి ప్రైవేట్ జీవితాలు వారివి.. పబ్లిక్‌లోకి వస్తేనే వారేంటో తెలుస్తుంది! అన్నారు మహాకవి శ్రీశ్రీ. మరి అలాంటి రాజకీయాల్లోకి వచ్చిన వారు అన్నిటికి సిద్ధమై రావాల్సిందే..! నేతిబీర చందంగా మారిన నేటి రాజకీయ విలువలను తాము నిలబెడతామని చెబితే.. నమ్మే సాధు పుంగవులు నేటి ప్రజల్లో లేనేలేరు. కానీ తాము నేడు బ్రష్టుపట్టిన రాజకీయాలను ఉద్ధ‌రిస్తామ‌ని జెండాలు క‌ప్పుకున్న నాయ‌కుల‌ను చూస్తే వీరిలో సంయమనం కనిపించడం లేదు. అసలు రాజకీయం అంటేనే విమర్శలు - ప్రతివిమర్శలు - గ్యాసిప్‌ ల సమాహారం. అదిగో పులి.. అంటే ఇదిగో తోక అనేదే నేటి రాజకీయం. అందునా నేడు పెరిగిపోయిన సోషల్ మీడియా పుణ్యమాని.. నాయకుల‌పై వస్తున్న వార్తలకు కొద‌వ ఉండడంలేదు.

నిజానికి సోషల్ మీడియా లేదా ఆన్‌ లైన్‌ సైట్లు కూడా రాజకీయాలను ప్రమాణికం చేసుకుని ముందుకు సాగుతున్నాయి. వాటి నీరు - వ‌న‌రు కూడా రాజకీయాలే. పోనీ, సోషల్ మీడియాను కానీ సైట్లను కానీ వ‌ద్ద‌ను కుందామా ? అంటే నేతల గురించి ప్రచారం జరిగేదెలా ? ప్రజలకు తెలిసేదెలా ? ఇదో పెద్ద అవినాభావ సంబంధం. అవునన్నా కాదన్నా.. నేతలు సోషల్ మీడియాలో న‌ల‌గ‌వ‌లసిందే. వారిపై వచ్చిన గ్యాసిప్‌లు ఎంజాయ్ చేయాల్సిందే. మరో మాటలో చెప్పాలంటే.. ఇది కూడా ఓ పెద్ద ప్రచారమే. అనంతపురం మాజీ ఎంపీ జేసీ వ్యాఖ్యలు చెప్పాలంటే.. అన్నిటినీ ఎంజాయ్ చేయాల్సిందే.

మంచి రాసినప్పుడు గ్రాఫ్ పెరిగిపోలా..! గ్యాసిప్ రాసినప్పుడు.. కుంగిపోవాలా! అన్న ఈ వ్యాఖ్యలు నేటి రాజకీయ నేతలకు శిరోధార్యం. అందుకే ఎన్ని వార్తలు - ఎన్ని గ్యాసిప్‌ లు వచ్చినా.. నేటి నేతలు టేకిట్‌ ఈజీ మెథడ్‌ నే ఫాలో అవుతున్నారు. అయితే, దీనికి భిన్నంగా వ్యవహరించి.. మరోరూపంలో మీడియాకు ఎక్కారు జేడీ లక్ష్మీనారాయణ. ఐపీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి మ‌రీ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనలాగే రాజకీయాలు కూడా స్ట్రిక్ట్‌ గా ఉండాలని అనుకున్నారో ఏమో.. కానీ నేటి రాజకీయాలు అలా లేవని - ఉండబోవని ఆయన గ్రహించే సరికి చాలా కాలమే పట్టింది. ఇటీవల ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన టికెట్‌ పై నిజాయితీ - నీతి ట్యాగ్‌ లతో పోటీ చేసి - అక్కడ వారికి బాండ్లు రాసి.. కొత్త రాజకీయాలకు తెరదీయాలని అనుకున్నారు.

అయితే, ఇవేవో అక్కడి ప్రజలకు అర్థం కాక ఆయ‌న‌కు చిత్తుగా ఓడించారు. ఈ ఓటమి భారం నుంచి ఆయన కోలుకున్నారు లేదో ఇప్పటికీ సస్పెన్సే. సరే! ఇప్పుడు సోషల్ మీడియా సహా ఆన్‌ లైన్‌ సైట్లలో ఆయన పార్టీ మారుతున్నారని - త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నార‌ని కొన్నాళ్లుగా వార్తలు - గ్యాసిప్‌ లు వస్తూనే ఉన్నాయి. వీటివల్ల ఆయ‌న‌కు బాధలేదు. పైగా పెద్ద ఎత్తున ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రచారం జరిగిపోయింది. దీనికి ఆయన ఆనందించాల్సిందిపోయి.. నోరేసుకున్నారు. `ఇలా రాసినవాడు ఫూల్ - ప్రచారం చేసిన వారు మూర్ఖులు - నమ్మినవాడు ఇడియట్`- అంటూ ఊగిపోయారు.

దీంతో సార్‌ కు ఇంకా రాజకీయాలంటే.. తెలియలేదులే.. అని సరిపుచ్చుకోగా.. మరికొందరు మాత్రం.. ఇలా అయితే, కష్టమే అంటున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత‌ జనసేనను టిడిపిలోనో.. బిజెపిలోనో విలీనం చేస్తారని వంద‌ల కొద్ది వార్తలు / గ‌్యాసిప్‌ లు వచ్చాయి. మరి ఆ పార్టీ అధినేత పవన్.. ఒక్కమాటంటే ఒక్కమాట తూల‌లేదు. మరి, ఆ పార్టీలోని ఆదర్శ నేత ఇలా నోరు చేసుకోవడం బాగోలేదని అంటున్నారు పరిశీలకులు కూడా!! మరి జేడీ సర్ ఇక‌పై అయినా జాగ్రత్త పడతారా!! చూడాలి.