Begin typing your search above and press return to search.

ఏం జరుగుతోంది.. మెగాస్టార్‌ తో జేడీ లక్ష్మీనారాయణ భేటీ!

By:  Tupaki Desk   |   30 May 2023 5:40 PM GMT
ఏం జరుగుతోంది.. మెగాస్టార్‌ తో జేడీ లక్ష్మీనారాయణ భేటీ!
X
మాజీ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వైఎస్సార్సీపీ అధినేత, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసును సీబీఐ తరఫున విచారించింది లక్ష్మీనారాయణే కావడం గమనార్హం. హైదరాబాద్‌ కేంద్రంగా జగన్‌ ను విచారించడం ద్వారా లక్ష్మీనారాయణ నిఖార్సైన, నిజాయతీపరుడైన అధికారిగా ఖ్యాతికెక్కారు. ఆ తర్వాత ఆయన స్వచ్ఛంధ పదవీ విరమణ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2,88,000కు పైగా ఓట్లు సాధించారు.

ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ పార్టీని పట్టించుకోకుండా సినిమాల్లో నటిస్తున్నారంటూ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్‌ బై చెప్పారు. బీజేపీ, టీడీపీ ఇలా వివిధ పార్టీల్లో చేరతారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఇటీవల జనసేనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో మరోమారు జనసేన పార్టీలోనే చేరతారని అంటున్నారు. విశాఖపట్నం నుంచే తాను వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని చెబుతున్నారు.

కాగా వ్యవసాయమంటే మక్కువ ఉన్న లక్ష్మీనారాయణ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామాల పరిధిలో దాదాపు 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. ఆ 12 ఎకరాల్లో ఆయన సేంద్రియ పంటలను పండిస్తున్నారు. ఇటీవలే సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేస్తున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

కాగా లక్ష్మీనారాయణ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ప్రియాంకకు పెళ్లి కుదిరింది. త్వరలో ఆమెకు వివాహం చేయనున్నారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో లక్ష్మీనారాయణ తీరిక లేకుండా గడుపుతున్నారు. సన్నిహితులు, బంధుమిత్రులను కలిసి వివాహ శుభలేఖలను పంచుతున్నారు.

ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ.. మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. తన సతీమణి ఊర్మిళతో కలిసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 25లోని మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లిన ఆయన చిరంజీవి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. తన కుమార్తె పెళ్లికి రావాలని కోరారు. లక్ష్మీనారాయణ దంపతులకు చిరంజీవి దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు.

కాగా లక్ష్మీనారాయణ వివిధ యూట్యూబ్‌ చానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే వివిధ కళాశాలలు, పాఠశాలల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. విద్యార్థులకు మోటివేషనల్‌ స్పీచులు ఇస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ ఉద్యమించిన సంగతి తెలిసిందే. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడ్డుపడాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేశారు.